election results: క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాబా ఆధిక్యం

  • జామ్ నగర్ నార్త్ నుంచి బీజేపీ తరఫున బరిలో నిలిచిన రివాబా
  • ఘట్లోబాలో సీఎం భూపేంద్ర పాటిల్ లీడ్
  • మోర్బీలో బీజేపీ అభ్యర్థి ఆధిక్యం.. ఎన్నికలలో ప్రభావం చూపని బ్రిడ్జి ప్రమాద ఘటన
  • మెయిన్ పురి బైపోల్ ఫలితాల్లో దూసుకుపోతున్న డింపుల్ యాదవ్
Rivaba jadeja leading in jamnagar north

భారత క్రికెట్ జట్టు సభ్యుడు రవీంద్ర జడేజా భార్య రివాబా గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. గుజరాత్ లోని జామ్ నగర్ నార్త్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున పోటీచేస్తున్న రివాబా జడేజా ఆధిక్యంలో ఉన్నారు. ఫలితాల ట్రెండ్ లో రివాబా లీడ్ లో దూసుకుపోతున్నారు. మరోవైపు, గుజరాత్ సీఎం, బీజేపీ అభ్యర్థి భూపేంద్ర పాటిల్ కూడా ఆధిక్యంలో ఉన్నారు. ఘట్లోడియా నియోజకవర్గం నుంచి భూపేంద్ర పాటిల్ మరోమారు బరిలో నిలిచారు.

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో మోర్బీ బ్రిడ్జి ప్రమాదం ఎలాంటి ప్రభావం చూపలేదని తేలిపోయింది. అక్టోబర్ లో మోర్బి పట్టణంలోని తీగల వంతెన కూలి 140 మంది చనిపోయిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంతో బీజేపీపై వ్యతిరేకత పెరుగుతుందని, నియోజకవర్గంలో బీజేపీ ఓటమి పాలవుతుందని ఎన్నికల పరిశీలకులు అభిప్రాయపడ్డారు. అయితే, ఇక్కడ బీజేపీ అభ్యర్థి కాంతిభాయ్ అమృతయ్య లీడ్ లో కొనసాగుతున్నారు.

బ్రిడ్జి ప్రమాదం తర్వాత కాంతిభాయ్ అమృతయ్య రెస్క్యూ పనుల్లో స్వయంగా పాల్గొన్నారు. బాధితులను కాపాడి ఆస్పత్రికి తరలించారు. దీంతో బీజేపీ మోర్బీ నియోజకవర్గంలో ఆయననే నిలబెట్టింది. ఆమ్ ఆద్మీ తరఫున పంకజ్ రన్ సారియా బరిలో నిలిచారు. అమృతయ్య, పంకజ్ రన్ సారియాలు బంధువులే కావడం విశేషం!

బైపోల్స్ లో డింపుల్ యాదవ్ లీడ్..
సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ మరణంతో మెయిన్ పురి లోక్ సభ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఇక్కడ ఎస్పీ పార్టీ తరఫున ములాయం సింగ్ కోడలు, అఖిలేష్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్ పోటీ చేశారు. ఫలితాల్లో డింపుల్ ముందంజలో దూసుకుపోతున్నారు. తన ప్రత్యర్థి కంటే డింపుల్ 5 వేల ఓట్ల మెజారిటీతో కొనసాగుతున్నారు.

More Telugu News