Ambati Rambabu: మీ గురించి వాస్తవాలు చెపితే ఉరేసుకుని చస్తారు: చంద్రబాబుపై అంబటి విమర్శలు

  • వివేకా హత్య కేసులో చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్న అంబటి
  • పోలవరంపై నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపాటు
  • చంద్రబాబు మళ్లీ అధికారంలోకి రాలేరని వ్యాఖ్య
Ambati Rambabu comments on Chandrababu

వైఎస్ వివేకా హత్య కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఏపీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. ప్రజల్లో అనుమానాలను సృష్టించి రాజకీయ లబ్ధి పొందేందుకు యత్నిస్తున్నారని విమర్శించారు. సీబీఐ విచారణలో వాస్తవాలు వెలుగులోకి వస్తాయని చెప్పారు. 

ఇక పోలవరం ప్రాజెక్టుపై కూడా చంద్రబాబు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని అన్నారు. కాఫర్ డ్యామ్ ను కట్టకుండానే డయాఫ్రం వాల్ ను నిర్మించిన ఘనత చంద్రబాబుదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం కట్టాల్సిన పోలవరం డ్యామ్ ను మేమే కడతామని చంద్రబాబు ఎందుకు నెత్తిన పెట్టుకున్నారని ప్రశ్నించారు. పోలవరంను చంద్రబాబు ఏటీఎంలా వాడుకున్నారని అన్నారు.

14 ఏళ్లు సీఎంగా ఉండి చంద్రబాబు చేసిందేముందని అంబటి రాంబాబు ప్రశ్నించారు. దొంగమాటలు చెప్పి మళ్లీ అధికారంలోకి రావాలనుకుంటున్నారని విమర్శించారు. చంద్రబాబుకు అధికారకాంక్ష తప్ప మరేమీ లేదని అన్నారు. మీ గురించి వాస్తవాలు చెపితే ఉరేసుకుని చస్తారని వ్యాఖ్యానించారు. ఎన్ని యాత్రలు చేసినా చంద్రబాబు అధికారంలోకి రాలేరని చెప్పారు. జగన్ సంక్షేమ పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారని అన్నారు.

More Telugu News