Atluri Rammohan Rao: అట్లూరి రామ్మోహన్ రావు గారి మరణం విచారకరం: చంద్రబాబు

  • రామోజీ సంస్థల మాజీ ఎండీ అట్లూరి రామ్మోహన్ రావు కన్నుమూత
  • అట్లూరి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపిన చంద్రబాబు 
  • రామ్మోహన్ రావు సేవలు చిరస్మరణీయమన్న లోకేశ్
  • తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానన్న అచ్చెన్నాయుడు
Chandrababu responds to the demise of Atluri Rammohan Rao

రామోజీ గ్రూపు సంస్థల మాజీ ఎండీ అట్లూరి రామ్మోహన్ రావు నేడు తుదిశ్వాస విడిచారు. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు స్పందించారు. అట్లూరి రామ్మోహన్ రావు గారి మరణం విచారకరం అని పేర్కొన్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానంటూ ట్వీట్ చేశారు. అట్లూరి రామ్మోహన్ రావు ఈనాడు దినపత్రిక మేనేజింగ్ డైరెక్టర్ గా ఒక ప్రత్యేకమైన ఒరవడిని తీర్చిదిద్దారని, రామోజీ గ్రూపులోని పలు సంస్థలకు ఎండీగా సుదీర్ఘకాలం సేవలందించారని కొనియాడారు. 

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కూడా అట్లూరి రామ్మోహన్ రావు మృతి పట్ల వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు. క్రమశిక్షణ, అంకితభావంతో దశాబ్దాలుగా ఈనాడు సంస్థలలో వివిధ హోదాలలో రామ్మోహన్ రావు గారు అందించిన సేవలు చిరస్మరణీయం అని లోకేశ్ పేర్కొన్నారు. 

అటు, అట్లూరి మృతి పట్ల టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా పెదపారుపూడిలో జన్మించిన అట్లూరి రామ్మోహన్ రావు అంచెలంచెలుగా ఎదుగుతూ, రామోజీ గ్రూపు సంస్థల్లో సుదీర్ఘకాలం ఎండీగా సేవలందించారని గుర్తుచేసుకున్నారు. 

ప్రజల కోసం, సమాజ అభ్యున్నతి కోసం అట్లూరి సేవలు నిరుపమానం అని కీర్తించారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంలో కీలకపాత్ర పోషించారని కొనియాడారు. రామ్మోహన్ రావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నట్టు ఓ ప్రకటనలో వెల్లడించారు.

More Telugu News