Raja Singh: పీడీ యాక్ట్ అడ్వైజరీ బోర్డు సమావేశానికి జైలు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరైన రాజాసింగ్ 

  • చర్లపల్లి జైల్లో ఉన్న రాజాసింగ్
  • రాజాసింగ్ పై పీడీ కేసు నమోదు చేసిన పోలీసులు
  • పీడీ యాక్ట్ బోర్డు సమావేశానికి రాజాసింగ్ భార్య కూడా హాజరు
Raja Singh attends PD Act advisary board meeting

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లోని చర్లపల్లి జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఆయనపై పీడీ యాక్ట్ నమోదయింది. ఈ నేపథ్యంలో ఈరోజు పీడీ యాక్ట్ అడ్వైజరీ బోర్డు సమావేశం జరిగింది. బోర్డు ఛైర్మన్ భాస్కరరావు, మరో ఇద్దరు జడ్జిల సమక్షంలో విచారణ జరిగింది. ఈ సమావేశానికి రాజాసింగ్ భార్య ఉషా బాయ్ తో పాటు వెస్ట్ జోన్ డీసీపీ, షాహినాయత్ గంజ్, మంగళ్ హాట్ పోలీసులు కూడా పాల్గొన్నారు. రాజాసింగ్ చర్లపల్లి జైలు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. 

విచారణ సందర్భంగా తనపై పీడీ యాక్టును నమోదు చేయడంపై రాజాసింగ్ అభ్యంతరాలు వ్యక్తం చేశారు. సుమారు గంటకు పైగా ఈ సమావేశం కొనసాగింది. నాలుగు రోజుల్లో పీడీ యాక్ట్ అడ్వైజరీ బోర్డు ఆదేశాలను జారీ చేసే అవకాశం ఉంది. మరోవైపు రాజాసింగ్ తరపు న్యాయవాది మాట్లాడుతూ, పీడీ యాక్ట్ నమోదును బోర్డు సమర్థిస్తే... తాము హైకోర్టులో సవాల్ చేస్తామని చెప్పారు. పీడీ యాక్ట్ ను బోర్డు వ్యతిరేకిస్తే జైలు నుంచి రాజా సింగ్ ను విడుదల చేసే అవకాశం ఉంది.

More Telugu News