Advertisement

పొగాకు సంక్షోభంపై కేంద్రం దృష్టి.. శాశ్వత పరిష్కారానికి సీఎం చంద్రబాబు పట్టు

Center focuses on tobacco crisis CM Chandrababu insists on permanent solution
  • పొగాకు రైతుల సమస్యలపై రంగంలోకి దిగిన కేంద్ర ప్రభుత్వం
  • తాత్కాలిక ఉపశమనం కాదు, శాశ్వత పరిష్కారం కావాలన్న సీఎం
  • రైతులను ఆదుకునేందుకు కేంద్ర బృందం మూడు ప్రతిపాదనలు
  • బయ్యర్లతో కేంద్ర మంత్రి పెమ్మసాని చర్చలు.. సోమవారం మరోసారి సమావేశం
రాష్ట్రంలోని పొగాకు రైతులు ఎదుర్కొంటున్న తీవ్ర సంక్షోభంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు జరిపిన నిరంతర సంప్రదింపుల ఫలితంగా కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ ఉన్నతస్థాయి బృందాన్ని రాష్ట్రానికి పంపింది. శనివారం కర్నూలు జిల్లా పర్యటనకు బయలుదేరే ముందు ముఖ్యమంత్రి చంద్రబాబుతో కేంద్ర వాణిజ్య శాఖ అదనపు కార్యదర్శి నితిన్ కుమార్ యాదవ్, డైరెక్టర్ మౌనికా గౌర్ భేటీ అయ్యారు.

ఈ కీలక సమావేశంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రులు గొట్టిపాటి రవికుమార్, డీబీవీ స్వామి, వ్యవసాయ, మార్క్‌ఫెడ్ ఉన్నతాధికారులు, టొబాకో బోర్డు ప్రతినిధులు పాల్గొన్నారు. పొగాకు రైతులను ఆదుకునేందుకు రూపొందించిన మూడు కీలక ప్రతిపాదనలపై కేంద్ర బృందం సీఎంతో చర్చించింది. వడ్డీ లేని వర్కింగ్ క్యాపిటల్ రుణాలు, ప్రోత్సాహకాలు, ధర లోటు భర్తీ వంటి అంశాలు ఈ ప్రతిపాదనల్లో ఉన్నాయి.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ, ఏ నిర్ణయం తీసుకున్నా రైతుల ప్రయోజనాలకే పెద్దపీట వేయాలని స్పష్టం చేశారు. ఏటా ఇదే సమస్య పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారం కనుగొనాలని సూచించారు. 

"తాత్కాలిక ఉపశమన చర్యలతో సరిపెట్టకుండా, స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక వ్యూహాలతో ఒక సమగ్ర విధానాన్ని రూపొందించాలి. రైతులు, బయ్యర్లు, టొబాకో బోర్డు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. అందరి సమష్టి బాధ్యతతోనే ఇది సాధ్యం" అని ఆయన అభిప్రాయపడ్డారు. పంటను నిల్వ ఉంచుకుని ధరలు స్థిరపడ్డాక అమ్ముకునే అవకాశాలను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. చర్చలను ముందుకు తీసుకెళ్లి, పరిష్కారం కనుగొనాలని కేంద్ర మంత్రి పెమ్మసానికి సూచించారు.

సీఎం సూచనల మేరకు, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, కేంద్ర ప్రభుత్వ అధికారులతో కలిసి పొగాకు బయ్యర్లతో వర్చువల్ సమావేశం నిర్వహించారు. రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయని, బయ్యర్లు కూడా సహకరించాలని కోరారు. తదుపరి చర్చల కోసం సోమవారం మరోసారి సమావేశం కావాలని నిర్ణయించారు. ఈ భేటీలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొని రైతుల కష్టాలను కేంద్ర ప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లారు.
Advertisement
Chandrababu Naidu
Tobacco crisis Andhra Pradesh
Pemmasani Chandra Sekhar
Tobacco Board India
Tobacco farmers relief
Central Commerce Ministry

More Telugu News