Punjab: నేడు బీజేపీలో చేరనున్న పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్

  • జేపీ నడ్డా సమక్షంలో నేడు బీజేపీలో చేరనున్న అమరీందర్ సింగ్
  • గతేడాది పంజాబ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా
  • ఆ తర్వాత కాంగ్రెస్‌ను వీడి పంజాబ్ లోక్ కాంగ్రెస్ స్థాపన
  • గత ఎన్నికల్లో ఆప్ అభ్యర్థి చేతిలో ఓడిన కెప్టెన్
Punjab ex CM Amarinder Singh to join BJP today

పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి, 'పంజాబ్ లోక్ కాంగ్రెస్' అధినేత కెప్టెన్ అమరీందర్ సింగ్ నేడు బీజేపీలో చేరనున్నారు. ప్రత్యేక పరిస్థితుల్లో గతేడాది సెప్టెంబరులో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన అమరీందర్ సింగ్ ఆ తర్వాత కాంగ్రెస్‌ను వీడారు. అప్పుడే ఆయన బీజేపీలో చేరబోతున్నట్టు ప్రచారం జరిగినా ఆయన దానిని ఖండించారు. ఆ తర్వాత పంజాబ్ లోక్ కాంగ్రెస్ (పీఎల్‌సీ)ని స్థాపించారు. ఆ తర్వాత పంజాబ్‌లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఆయన పార్టీ ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. పాటియాలా అర్బన్ నుంచి బరిలోకి దిగిన అమరీందర్ సింగ్ ఆప్ అభ్యర్థి చేతిలో 19,873 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.

ఈ నేపథ్యంలో ఆయన తన పార్టీని బీజేపీలో విలీనం చేయాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా నేడు ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో కాషాయ తీర్థం పుచ్చుకోబోతున్నారు. అమరీందర్ సింగ్‌తోపాటు ఆయన పార్టీ పీఎల్‌సీలో చేరిన ఏడుగురు మాజీ ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ కూడా నేడు కాషాయ కండువా కప్పుకోబోతున్నారు.

More Telugu News