Telangana: లాలూతో కేసీఆర్ భేటీ... ఆర్జేడీ అధినేత ఆరోగ్యంపై ఆరా

  • బీహార్ ప‌ర్య‌ట‌న‌లో బిజీబిజీగా కేసీఆర్‌
  • లాలూ ప్ర‌సాద్ యాద‌వ్‌తో భేటీ అయిన తెలంగాణ సీఎం
  • లాలూ ఆరోగ్య ప‌రిస్థితిపై ఆరా తీసిన వైనం
kcr meets lalu prasad yadav in patna

బీహార్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన టీఆర్ఎస్ అధినేత‌, తెలంగాణ సీఎం కేసీఆర్‌... ఆ రాష్ట్ర రాజ‌ధాని పాట్నాలో బుధ‌వారం బిజీబిజీగా గ‌డిపారు. బుధ‌వారం మ‌ధ్యాహ్న స‌మ‌యంలో పాట్నా చేరుకున్న కేసీఆర్‌...బీహార్ సీఎం నితీశ్ కుమార్‌, డిప్యూటీ సీఎం తేజ‌స్వీ యాద‌వ్‌ల‌తో క‌లిసి... గ‌ల్వాన్ లోయ‌లో అమ‌రులైన జ‌వాన్ల కుటుంబాల‌కు ఆర్థిక సాయానికి చెందిన చెక్కుల‌ను పంపిణీ చేశారు. అనంతరం నితీశ్‌, తేజ‌స్వీల‌తో క‌లిసి జాతీయ రాజ‌కీయాల‌పై ఆయ‌న సుదీర్ఘంగా స‌మావేశ‌మ‌య్యారు.

ఈ స‌మావేశం ముగిసిన త‌ర్వాత రాష్ట్రీయ జ‌న‌తా ద‌ళ్ (ఆర్జేడీ) అధినేత‌, బీహార్ మాజీ సీఎం, కేంద్ర మాజీ మంత్రి లాలూ ప్ర‌సాద్ యాద‌వ్‌తో భేటీ అయ్యారు. అవినీతి ఆరోప‌ణ‌ల కార‌ణంగా సుదీర్ఘ కాలం జైల్లో గ‌డిపిన లాలూ ఇటీవ‌ల విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లే బీజేపీతో మైత్రికి చెక్ చెప్పిన నితీశ్‌.. లాలూ నేతృత్వంలోని ఆర్జేడీతో పొత్తు పెట్టుకుని కొత్త స‌ర్కారును ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. నితీశ్‌ త‌న కొత్త కేబినెట్‌లో లాలూ కుమారుడు తేజ‌స్వీ యాద‌వ్‌కు డిప్యూటీ సీఎం పోస్టును ఇచ్చారు.

ఇలాంటి నేప‌థ్యంలో నేరుగా లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ వ‌ద్ద‌కు వెళ్లిన కేసీఆర్ ఆయ‌న‌తో భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా లాలూ ఆరోగ్య ప‌రిస్థితిపై ఆరా తీసిన కేసీఆర్‌... లాలూ త్వ‌ర‌గా అనారోగ్యం నుంచి కోలుకుని రాజ‌కీయాల్లో యాక్టివ్ పాత్ర పోషించాల‌ని అభిల‌షించారు. అటు నితీశ్ ఆధ్వ‌ర్యంలోని జేడీయూతో పాటు ఇటు లాలూ నేతృత్వంలోని ఆర్జేడీతో ఒకే రోజు కేసీఆర్ కీల‌క చ‌ర్చ‌లు జ‌ర‌ప‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది.

More Telugu News