గవర్నర్ తమిళిసైని కలిసిన వీహెచ్పీ, భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ కమిటీ సభ్యులు
- రాష్ట్రంలో విద్వేషాలను రెచ్చగొడుతున్నారని ఫిర్యాదు
- ఇక్కడ జరుగుతున్న విషయాలపై కేంద్రానికి నివేదిక పంపాలని విన్నపం
- గణేశ్ ఉత్సవాలు అడ్డంకులు లేకుండా కొనసాగేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి
ఇక్కడ జరుగుతున్న విషయాలను ఉన్నది ఉన్నట్టుగా కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని గవర్నర్ ను కోరామని గణేశ్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు భగవంత రావు చెప్పారు. ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నా ప్రభుత్వం, పోలీసులు నిమ్మకు నీరెత్తినట్టు ఉంటున్నారని విమర్శించారు. హైదరాబాద్ లో మునావర్ షో అవసరమా? అని ప్రశ్నించారు. ఈ షో కోసం 4 వేల మంది పోలీసులతో భద్రత అవసరమా? అని ప్రశ్నించారు. మైనార్టీలను ఉసిగొల్పి పబ్బం గడుపుకుంటున్నారని మండిపడ్డారు. గణేశ్ ఉత్సవాలు ఎలాంటి అడ్డంకులు లేకుండా కొనసాగేలా చర్యలు తీసుకోవాలని గవర్నర్ ను కోరామని చెప్పారు.