RJD: నితీశ్ కుమార్ బలపరీక్షకు ముందు.. ఇద్దరు ఆర్జేడీ నేతలపై సీబీఐ దాడులు

  • నేడు అసెంబ్లీలో బల పరీక్షకు సిద్ధమవుతున్న నితీశ్ కుమార్
  • ల్యాండ్ ఫర్ జాబ్స్ స్కామ్‌ను మరోమారు తెరపైకి తెచ్చిన సీబీఐ
  • పలువురు ఆర్జేడీ నేతలపై దాడులు నిర్వహించిన సీబీఐ
  • దాడులు ఎవరు చేసినా అవి బీజేపీ చేస్తున్నవేనన్న ఆర్జేడీ
CBI raids 2 RJD leaders in land for jobs scam in Bihar

బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ శాసనసభలో బలపరీక్షకు సిద్ధమవుతున్న వేళ సీబీఐ షాకిచ్చింది. ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ హయాంలో జరిగిన ‘ఉద్యోగాల కోసం భూమి’(ల్యాండ్ ఫర్ జాబ్స్ స్కామ్) కుంభకోణం కేసులో లాలూ సహాయకుడు సునీల్ సింగ్ సహా ఆర్జేడీ నేతలపై సీబీఐ దాడులు చేసింది. అలాగే, సుబోధ్ రాయ్, అష్ఫక్ కరీమ్, ఫయాజ్ అహ్మద్‌లపైనా దర్యాప్తు సంస్థ దాడులు నిర్వహించింది. 

ఈ దాడులపై సునీల్ సింగ్ మాట్లాడుతూ.. ఉద్దేశపూర్వకంగానే ఈ దాడులు జరుపుతున్నట్టు ఆరోపించారు. ఇప్పటికే ఓసారి దాడులు జరిపారని, మళ్లీ దాడులకు అర్థమే లేదన్నారు. దాడులతో భయపెడితే ఎమ్మెల్యేలు తమ గూటికి చేరుతారని వారు భావిస్తున్నారని పరోక్షంగా బీజేపీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. 

సీబీఐ దాడులపై ఆర్జేడీ రాజ్యసభ సభ్యుడు మనోజ్ ఝా మాట్లాడుతూ.. దాడులు ఈడీ చేసినా, ఐటీ చేసినా, సీబీఐ చేసినా ఆ దాడులన్నీ బీజేపీ చేస్తున్నవేనని విమర్శించారు. వారి కార్యాలయాలన్నీ బీజేపీ స్క్రిప్ట్‌తోనే పనిచేస్తాయని అన్నారు. నేడు బలపరీక్ష జరుగుతున్న నేపథ్యంలో ఇక్కడేం జరుగుతుందో ఊహించొచ్చన్నారు. 

అసలు ఈ పరిస్థితి ఎదురవుతుందని తమ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ నిన్నటి సమావేశంలోనే చెప్పారన్నారు. ఆయన చెప్పి 24 గంటలు కూడా గడవకముందే వారు మరింత కిందికి దిగజారిపోయారని అన్నారు. మీ ఇష్టం వచ్చిన ప్రభుత్వం లేదన్న కోపమా? అని బీజేపీని ఆయన ప్రశ్నించారు.

More Telugu News