Sunil Kumar: ఆ ఫోరెన్సిక్ సర్టిఫికెటే ఫేక్.. చర్యలు తీసుకుంటాం: ఎంపీ మాధవ్ వీడియో వ్యవహారంలో సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ ప్రెస్ మీట్

  • తీవ్ర చర్చనీయాంశంగా ఎంపీ మాధవ్ వీడియో కాల్
  • వీడియోకు అమెరికాలో ఫోరెన్సిక్ టెస్టు చేయించామన్న టీడీపీ 
  • అందులో ఉన్నది గోరంట్ల మాధవ్ అని టీడీపీ వాదన 
  • ఒరిజినల్ సర్టిఫికెట్ కు మార్పులు చేశారన్న సునీల్ కుమార్
CID Chief Sunil Kumar press meet over MP Gorantla Madhav issue

వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ నగ్న వీడియో కాల్ అంటూ ఓ వీడియో రేపిన సంచలనం అంతాఇంతా కాదు. రాష్ట్రవ్యాప్తంగా ఇది తీవ్ర చర్చనీయాంశం అయింది. అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. అది మార్ఫింగ్ వీడియో అని ఎంపీ గోరంట్ల మాధవ్ అంటుండగా, అమెరికాలో ఫోరెన్సిక్ టెస్టు చేయిస్తే అందులో ఉన్నది మాధవ్ అని స్పష్టమైందని టీడీపీ నేతలు అంటున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. 

ఈ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అది ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన కాల్ అని, దాన్ని మూడో వ్యక్తి షూట్ చేశాడని, ఇప్పుడు బయట సర్క్యులేట్ అవుతున్నది ఆ మూడో వ్యక్తి షూట్ చేసిన వీడియోనే అని వెల్లడించారు. 

"ఆ వీడియోను అమెరికాలోని ఎక్లిప్స్ ఫోరెన్సిక్ ల్యాబ్ లో టెస్టు చేయించామని చెబుతున్నారు. ఆ ల్యాబ్ ఇచ్చే రిపోర్టుకు ఎంత సాధికారిత ఉందో చెప్పలేం. అసలు, ఆ సంస్థ ఇచ్చినట్టు చెబుతున్న రిపోర్టే ఫేక్... ఒరిజనల్ కాదు. ఎక్లిప్స్ ఫోరెన్సిక్ ల్యాబ్ తరఫున జిమ్ స్టాఫోర్డ్ అనే వ్యక్తి ల్యాబ్ రిపోర్టు ఇచ్చినట్టు ఓ సర్టిఫికెట్ దర్శనమిస్తోంది. ఆ వీడియో ఒరిజనలేనని అందులో పేర్కొన్నారు. ఈ విషయంలో నిగ్గు తేల్చమని మమ్మల్ని ప్రభుత్వం కోరడంతో జిమ్ అనే వ్యక్తిని ఈమెయిల్ ద్వారా సంప్రదించాము. అయితే, తన పేరిట వెలువడిన ల్యాబ్ రిపోర్టు ఒరిజినల్ కాదని, అది ఫేక్ రిపోర్టు అని జిమ్ మాకు ఈమెయిల్ ద్వారా స్పష్టం చేశాడు.

ఇక వీడియోలోని కంటెంట్ విషయానికొస్తే.... మీకు రాజమౌళి తీసిన 'ఆర్ఆర్ఆర్' చిత్రాన్ని ఉదాహరణగా చెప్పాలి. అందులో కొన్ని జంతువులతో సీన్లు చేశారు. వాటి చిత్రీకరణలో గ్రాఫిక్స్ ఉపయోగించారు. సినిమా చూసే సమయంలో ఆ జంతువుల సీన్లను మీ మొబైల్ ఫోన్లతో షూట్ చేసి ఆ వీడియో ఒరిజినలా, కాదా అని ఫోరెన్సిక్ ల్యాబ్ ను కోరితే, అది ఒరిజనలే అని చెబుతారు. కానీ అందులో ఉన్న కంటెంట్ ఏదైతే ఉందో అది ఒరిజినలో, కాదో చెప్పలేరు. 

అందులో ఉన్న కంటెంట్ ఒరిజనలో, కాదో చెప్పాలంటే రాజమౌళి తీసిన 'ఆర్ఆర్ఆర్' సినిమా తాలూకు ఒరిజినల్ ఫుటేజిని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపాల్సి ఉంటుంది. అప్పుడే అది గ్రాఫిక్సో, ఒరిజనలో చెబుతారు. అంతేకానీ, సినిమా తెరపై కదిలే బొమ్మలను మొబైల్ ఫోన్లతో షూట్ చేసిన వీడియోను ప్రపంచంలో ఏ ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపినా అందులో కంటెంట్ ఒరిజనలో, కాదో చెప్పలేరు. అనంతపురం జిల్లా ఎస్పీ ఫకీరప్ప గారు చెప్పింది కూడా ఇదే. 

ఇప్పుడు చర్చనీయాంశంగా మారిన వీడియోలో ఒక పురుషుడు, ఒక మహిళ సంభాషించుకుంటున్నట్టుగా ఉంది. వీరిద్దరి ఫోన్లలోనే ఒరిజినల్ డేటా ఉంటుంది. వీరిద్దరిలో ఏ ఒక్కరి ఫోన్ డేటా అయినా విశ్లేషిస్తేనే అది ఒరిజనల్ కంటెంటా, కాదా అనేది తేలుతుంది. ఎక్లిప్స్ ల్యాబ్ కు చెందిన జిమ్ స్టాఫోర్డ్ దీని గురించి స్పష్టం చేశారు. 

ఆ రిపోర్టులో మార్పులు చేయాలని మిస్టర్ పోతిని అనే వ్యక్తి కోరారని జిమ్ చెప్పారు. దాని గురించి ఆలోచించే లోపే మార్పులు చేర్పులు చేసి విడుదల చేశారని ఆయన వెల్లడించారు. తాను ఇచ్చిన సర్టిఫికెట్ కు, మీడియాలో కనిపిస్తున్న సర్టిఫికెట్ కు తేడా ఉండడంతో అది ఫేక్ సర్టిఫికెట్ అని జిమ్ స్టాఫోర్డ్ తేల్చి చెప్పారు. ఎక్కడైనా ఫేక్ సర్టిఫికెట్లను ప్రచారం చేయడం నేరం... ఆ విధంగా ప్రచారం చేసినవారిపై చర్యలు తీసుకుంటాం" అని సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ స్పష్టం చేశారు.

More Telugu News