t20: శ్రీలంక నుంచి యూఏఈకి తరలి వెళ్లిన ఆసియా కప్

  • ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ వరకు ఆసియా కప్ టీ20 టోర్నీ
  • ఆతిథ్య హక్కులు సొంతం చేసుకున్న శ్రీలంక క్రికెట్ బోర్డు
  • ప్రస్తుత పరిస్థితుల్లో టోర్నీ నిర్వహించలేమని ప్రకటన
Asia cup shifted to UAE from Srilanka

ఆర్థిక, రాజకీయ సంక్షోభంతో ఇబ్బందుల్లో ఉన్న శ్రీలంక ఓ ప్రధాన క్రికెట్ టోర్నమెంట్ కు ఆతిథ్యం ఇచ్చే అవకాశాన్ని కోల్పోయింది. శ్రీలంక ఆతిథ్యం ఇవ్వాల్సిన ఆసియా కప్‌  టోర్నమెంట్‌ను యూఏఈకి తరలించినట్టు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ తెలిపారు. ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్‌ 11 వరకు జరగాల్సిన ఈ టోర్నీ ఆతిథ్య హక్కులు శ్రీలంక క్రికెట్‌ సొంతం చేసుకుంది.

ఇక ఈసారి ఆసియా కప్ టోర్నీని టీ20 ఫార్మాట్ లో నిర్వహించాలని అంతర్జాతీయ క్రికెట్ సమాఖ్య (ఐసీసీ) నిర్ణయించింది. అయితే, తమ దేశంలో నెలకొన్న ప్రస్తుత రాజకీయ, ఆర్థిక సంక్షోభం దృష్ట్యా టోర్నీని నిర్వహించలేమని లంక బోర్డు బుధవారం ప్రకటించింది. 

ఈ నేపథ్యంలో టోర్నీ యూఏఈలో జరుగుతుందని, ఈ సమయంలో అక్కడ అయితేనే వర్షాలు పడవని గురువారం ముంబైలో జరిగిన బీసీసీఐ అపెక్స్‌ సమావేశానికి హాజరైన గంగూలీ చెప్పారు. మరోవైపు 2022–23లో పూర్తిస్థాయి దేశవాళీ సీజన్‌ జరుగుతుందని స్పష్టం చేశారు. కరోనా కారణంగా గత మూడేళ్లుగా ఆగిపోయిన దులీప్‌ ట్రోఫీ, ఇరానీ కప్‌ టోర్నీలను తిరిగి ప్రారంభించాలని బీసీసీఐ నిర్ణయించింది.

More Telugu News