Cricket: టెస్టు మ్యాచ్​ మధ్యలో ఆటగాడికి కరోనా.. షాక్​లో జట్టు

  • కరోనా పాజిటివ్ గా తేలిన శ్రీలంక ఓపెనర్ పాతుమ్ నిసాంక
  • ఆస్ట్రేలియాతో రెండో టెస్ట మూడో రోజు తర్వాత వైదొలిగిన ఓపెనర్
  • తొలి ఇన్నింగ్స్ లో 67 పరుగుల ఆధిక్యంలో మంచి స్థితిలో ఆతిథ్య జట్టు
 Srilanka opener pathum nissanka tested positive midway through the Test match

సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో రెండో టెస్టు మ్యాచ్లో మెరుగ్గా ఆడుతున్న శ్రీలంక క్రికెట్ జట్టుకు షాక్ తగిలింది. ఆ జట్టు ఓపెనర్ పాతుమ్ నిసాంక మ్యాచ్ మధ్యలో కరోనా వైరస్ బారిన పడ్డాడు. ఆదివారం ఆరోగ్యం బాగోలేదని ఫిర్యాదు చేసిన తర్వాత నిసాంకకు ర్యాపిడ్-యాంటిజెన్ పరీక్ష చేయగా పాజిటివ్ రిజల్ట్ వచ్చింది. దాంతో, అతను మ్యాచ్ నుంచి వైదొలిగాడు. అతని స్థానంలో ఒషాడ ఫెర్నాండో కొవిడ్ సబ్ సబ్ స్టిట్యూట్ గా జట్టులోకి వచ్చాడు. 

 మరోవైపు మూడో రోజు, ఆదివారం ఆట చివరకు శ్రీలంక ఈ మ్యాచ్ లో మంచి స్థితిలో నిలిచింది. కెప్టెన్ దినేశ్ చండిమల్ (118 బ్యాటింగ్) సెంచరీతో సత్తా చాటడంతో తొలి ఇన్నింగ్స్ లో 431/6 స్కోరుతో నిలిచింది. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ స్కోరు కంటే 67 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. కానీ, ఇప్పుడు నిసాంక కరోనా పాజిటివ్ గా తేలడంతో ఆ జట్టులో ఆందోళన మొదలైంది.

శ్రీలంక క్రికెట్ జట్టు ను కరోనా వైరస్ వెంటాడుతోంది. మొదటి టెస్ట్ మ్యాచ్‌లో ఆడిన ముగ్గురు స్పిన్నర్లు జెఫ్రీ వాండర్సే, ధనంజయ డి సిల్వా, అసిత ఫెర్నాండో పాజిటివ్ గా తేలి రెండో టెస్టుకు దూరమయ్యారు. శ్రీలంక, ఆస్ట్రేలియా జట్లు ఒకే హోటల్‌లో బస చేస్తున్నాయి. ఆసీస్ జట్టులో మాత్రం ఎవ్వరూ వైరస్ బారిన పడలేదు.

More Telugu News