CM Jagan: పులివెందులలో న్యూటెక్‌ బయోసైన్సెస్‌కు శంకుస్థాపన చేసిన సీఎం జగన్

  • కడప జిల్లాలో సీఎం జగన్ పర్యటన
  • సొంత నియోజకవర్గంలో అభివృద్ధి పనులు
  • ప్రకృతి వ్యవసాయం ఆవశ్యకతను వివరించిన సీఎం
  • రసాయనాలతో కూడిన ఆహారంతో క్యాన్సర్ ముప్పు ఉందని వెల్లడి
CM Jagan lays foundation for New Tech Biosciences

ఏపీ సీఎం జగన్ కడప జిల్లాలో పర్యటిస్తున్నారు. ఆయన తన సొంత నియోజకవర్గం పులివెందులలో న్యూటెక్ బయోసైన్సెస్ కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రసాయనాలతో కూడిన ఆహారం కారణంగా అనేక రకాల క్యాన్సర్లు వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆహార ఉత్పత్తుల్లో రసాయనాల వాడకం తగ్గించాల్సిన అవసరం ఉందని సీఎం జగన్ పిలుపునిచ్చారు. ఈ రోజుల్లో ప్రకృతి వ్యవసాయం అన్ని విధాలా శ్రేయస్కరం అని అభిప్రాయపడ్డారు. 

ఏపీలో 6 లక్షల మంది రైతులు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారని వెల్లడించారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు గ్రామాలపై మరింత దృష్టి సారించాలని సూచించారు. ప్రకృతి వ్యవసాయంపై రైతుల్లో అవగాహన పెంచాలని, ఇందుకు గ్రామస్థాయి నుంచి శిక్షణ అవసరమని అన్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా అవసరమైన శిక్షణ అందిస్తున్నామని తెలిపారు. ప్రకృతి వ్యవసాయంపై పలు అంతర్జాతీయ సంస్థలతో ఏపీ ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుంటోందని సీఎం జగన్ వెల్లడించారు. 

రైతుల పెట్టుబడి వ్యయాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం తరఫున పలు చర్యలు చేపడుతున్నట్టు ఆయన వివరించారు. విత్తు నుంచి విక్రయం వరకు రైతు భరోసా కేంద్రాలు అండగా నిలుస్తున్నాయని స్పష్టం చేశారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని, ఈ దిశగా పలు పథకాలను అమలు చేస్తున్నామని చెప్పారు.

More Telugu News