కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు లేఖ రాసిన సీఎం చంద్రబాబు
- తోతాపురి మామిడి రైతులను ఆదుకోవాలని కేంద్రానికి సీఎం చంద్రబాబు లేఖ
- అంతర్జాతీయ మార్కెట్ సమస్యలతో నిలిచిపోయిన మామిడి గుజ్జు ఎగుమతులు
- భారీగా పడిపోయిన తోతాపురి ధరలు.. తీవ్రంగా నష్టపోతున్న రైతులు
- మామిడి కొనుగోలుకు రూ. 281 కోట్లు కేటాయించాలని కేంద్రానికి వినతి
- రైతుల కోసం ప్రత్యేక ధరల వ్యత్యాస చెల్లింపు పథకం అమలు చేయాలని విజ్ఞప్తి
అంతర్జాతీయంగా నెలకొన్న ప్రతికూల మార్కెట్ పరిస్థితుల కారణంగా మామిడి గుజ్జు (పల్ప్) ఎగుమతులు పూర్తిగా నిలిచిపోయాయని చంద్రబాబు తన లేఖలో వివరించారు. దీని ప్రత్యక్ష ప్రభావంతో స్థానిక మార్కెట్లలో తోతాపురి మామిడి ధరలు ఒక్కసారిగా కుప్పకూలాయని, దీంతో రైతులు పెట్టిన పెట్టుబడి కూడా రాక తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ క్లిష్ట పరిస్థితుల్లో రైతులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం తక్షణమే సహాయం అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో సుమారు 7.03 లక్షల మెట్రిక్ టన్నుల తోతాపురి మామిడిని రైతుల నుంచి సేకరించేందుకు రూ. 281 కోట్లు ఆర్థిక సహాయంగా మంజూరు చేయాలని కోరారు. దీంతో పాటు, మార్కెట్ ధరకు, గిట్టుబాటు ధరకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని భర్తీ చేసేలా ప్రత్యేకంగా 'ధరల వ్యత్యాస చెల్లింపు పథకం' (Price Deficiency Payment Scheme) అమలు చేయాలని సూచించారు.