GST: సిగరెట్లు, ప్రీమియం మోటార్​ సైకిళ్లు, విమాన ప్రయాణాలపై మరో నాలుగేళ్లు జీఎస్టీ పరిహార సెస్​

  • కొనసాగిస్తూ జీఎస్టీ మండలి నిర్ణయం
  • 2026 మార్చి 31 వరకు అమల్లో అదనపు సెస్
  • నోటిఫై చేసిన కేంద్ర ఆర్థిక శాఖ
  • రాష్ట్రాలకు నిధులిచ్చేందుకు చేసిన అప్పులు తీర్చడానికి వినియోగం
gst compensation cess levy extended another 4 years

వస్తు సేవల పన్ను (జీఎస్టీ)ను ప్రవేశపెట్టడం వల్ల రాష్ట్రాలకు వచ్చే నష్టాన్ని పూడ్చేందుకు తెచ్చిన ‘జీఎస్టీ పరిహార సెస్సు’ను కేంద్ర ప్రభుత్వం మరో నాలుగేళ్లు పొడిగించింది. దీనివల్ల జీఎస్టీలో ప్రీమియం కేటగిరీలోకి వచ్చే ఉత్పత్తులైన పొగాకు, సిగరెట్లు, ఎక్కువ ధర ఉండే మోటార్ సైకిళ్లు, విమాన ప్రయాణాలు, ఏరేటెడ్ వాటర్ వంటి వాటి ధరలు మరికొంత కాలం అధిక స్థాయిలో కొనసాగనున్నాయి.
  
2026 మార్చి వరకు..
జీఎస్టీ పరిహార సెస్సు ఈ నెలాఖరుతో ముగియాల్సి ఉంది. కానీ దీనిని మరికొంత కాలం పొడిగించాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలోని జీఎస్టీ మండలి నిర్ణయించింది. ఈ మేరకు సెస్ ను 2025–26 ఆర్థిక సంవత్సరం వరకు పొడిగిస్తూ కేంద్ర ఆర్థిక శాఖ శనివారం ప్రకటించింది. అంటే 2026 మార్చి 31 వరకు ఈ అదనపు సెస్ అమల్లో ఉండనుంది. దీనితోపాటు పలు కొత్త నిబంధనలను కూడా కేంద్ర ఆర్థిక శాఖ నోటిఫై చేసింది. జీఎస్టీ అమలు వల్ల రాష్ట్రాలకు వచ్చిన నష్టాలను భర్తీ చేసేందుకు కేంద్రం మూడేళ్లుగా నిధులు ఇస్తోంది. ఇందుకోసం అప్పులు చేసింది. ఆ అప్పులను తీర్చేందుకు జీఎస్టీ పరిహార సెస్ ను వినియోగించుకోనుంది.

More Telugu News