Rajasthan: నేను మళ్లీ పుట్టాను.. గత జన్మ విషయాలను పూసగుచ్చినట్టు వివరిస్తున్న నాలుగేళ్ల బాలిక!

  • రాజస్థాన్‌లో ఘటన
  • ఏడాది క్రితం నుంచే తన తల్లిదండ్రులు, సోదరుల గురించి ఆరా
  • భయంతో వైద్యులకు చూపించిన తల్లిదండ్రులు
  • ఎలాంటి మానసిక సమస్యలు లేవని నిర్ధారణ
  • చిన్నారి చెప్పింది అక్షరాలా నిజమని తేలిన వైనం
Rajasthan girl remember he memories of last birth

పునర్జన్మలు అనేవి ఉన్నాయా? అంటే.. ఈ విషయంలో ఒక్కొక్కరిదీ ఒక్కో అభిప్రాయం. కొందరు ఉన్నాయని నమ్మితే, మరికొందరు అలాంటివేవీ లేవని కొట్టిపడేస్తుంటారు. ఎవరి అభిప్రాయం ఎలా ఉన్నా.. పునర్జన్మలకు సంబంధించి ఇప్పటికీ ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి.

ఇదే కోవలో తాజాగా రాజస్థాన్‌కు చెందిన నాలుగేళ్ల బాలిక గత జన్మ వివరాలను పూసగుచ్చినట్టు వివరిస్తోంది. ఇంకా ఆశ్చర్యమేమిటంటే.. ఆమె చెప్పిన విషయాలపై ఆరా తీస్తే అన్నీ నిజమేనని తేలింది. బాలీవుడ్ స్టార్లు సల్మాన్‌ఖాన్, షారూఖ్ ఖాన్ నటించిన ‘కరణ్ అర్జున్’ సినిమాను గుర్తుకు తెస్తున్న ఈ ఘటన పూర్వాపరాల్లోకి వెళ్తే..

రాజస్థాన్‌లోని పారావాల్ గ్రామానికి చెందిన రతన్‌సింగ్ చుందావత్‌కు ఐదుగురు కుమార్తెలు. వారిలో నాలుగేళ్ల కింజల్ ఒకరు. ఏడాది క్రితం నా సోదరుడు ఏడంటూ తండ్రి రతన్‌సింగ్‌ను ఆ బాలిక అడిగింది. అయితే, ఆమె మాటలను రతన్‌సింగ్ పట్టించుకోలేదు. అయినప్పటికీ ఆమె అడగడం మానలేదు. ఒక రోజు బాలిక తన గతజన్మ స్మృతుల గురించి పూసగుచ్చినట్టు తల్లిదండ్రులకు వివరించింది.

అప్పట్లో తన తల్లిదండ్రులు, సోదరుడి గురించి చెబుతూ వారి పేర్లను కూడా చెప్పింది. అప్పట్లో తన పేరు ఉష అని, 2013లో ప్రమాదశాత్తు మంటల్లో కాలిపోయి మరణించానని చెప్పింది. దీంతో కుమార్తె మానసిక అనారోగ్యంతో బాధపడుతోందని భావించి వెంటనే చిన్నారిని వైద్యులకు చూపించారు. పరీక్షల్లో ఆమెకు ఎలాంటి సమస్యలు లేవని వైద్యులు తేల్చారు. ఆరోగ్య సమస్యలు లేవని తేలడంతో బాలికను వెంటపెట్టుకుని ఆమె చెబుతున్న పిప్లాంత్రి అనే గ్రామానికి వెళ్లారు. వీరుంటున్న గ్రామానికి అది 30 కిలోమీటర్ల దూరంలోనే ఉంది.

గ్రామానికి వెళ్లిన చిన్నారి తన గత జన్మ తల్లిదండ్రులను గుర్తించింది. తన ఇద్దరు పిల్లలు ఎలా ఉన్నారని వారి పేర్లతో సహా అడిగి తెలుసుకుంది. ఆ ఇంటితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంది. గ్యాస్ సిలిండర్ పేలడంతో తాను చనిపోయానంటూ ఆ రోజు జరిగిన ఘటనను పూర్తిగా వివరించింది. చిన్నారి మాటలు పూర్తి వాస్తవంగా ఉండడంతో ఇరు కుటుంబాలు ఆమె చెప్పింది నిజమేనని తేల్చారు.

ఈ ఘటన తర్వాత రెండు కుటుంబాల మధ్య బంధుత్వానికి అతీతమైన బంధం ఏర్పడింది. బాలిక ప్రస్తుతం తనకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల వద్దే ఉంటోంది. గత జన్మలోని తల్లిదండ్రులతో తరచూ ఫోన్‌లో మాట్లాడుతూ.. తనకన్నా వయసులో పదేళ్ల పెద్దవారైన తన పిల్లల యోగక్షేమాలను అడిగి తెలుసుకుంటోంది. ఈ విషయం మాత్రం ఇప్పుడు ఆ చుట్టుపక్కల గ్రామాలలో సంచలనంగా మారింది. 

More Telugu News