Kodali Nani: నిరూపించండి... పెట్రోల్ పోసుకుని అంటించుకుంటా: కొడాలి నాని సవాల్

  • నా కన్వెన్షన్లో కేసినోలు నిర్వహించినట్టు నిరూపించండి
  • నిజనిర్ధారణకు వచ్చిన టీడీపీ నేతలంతా ఎన్నికల్లో ఓడిపోయినవారే
  • చంద్రబాబు, లోకేశ్ లకు కేసినోలు బాగా తెలుసు
Kodali Nani response on Gudivada casino issue

గుడివాడలో మంత్రి కొడాలి నానికి చెందిన కన్వెన్షన్ సెంటర్లో కేసినో ఆటను నిర్వహించారంటూ తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో.. ఈ విషయాన్ని తెలుగుదేశం పార్టీ ప్రధానాస్త్రంగా మలుచుకుంటోంది. ఆ పార్టీకి చెందిన నేతలు నిజనిర్ధారణ కోసం గుడివాడకు వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు ఈ ఆరోపణలపై కొడాలి నాని తీవ్రంగా ప్రతిస్పందించారు.
 
తన కల్యాణమంటపం రెండున్నర ఎకరాల్లో ఉంటుందని... అక్కడ కేసినోలు, పేకాట వంటివి నిర్వహించినట్టు నిరూపిస్తే పెట్రోల్ పోసుకుని తగలబెట్టుకుంటానని కొడాలి నాని సవాల్ విసిరారు. చంద్రబాబు టైమ్ అయిపోయిందని అన్నారు. ఈరోజు నిజనిర్ధారణకు వచ్చినవాళ్లంతా ఎన్నికల్లో ఓడిపోయిన వారేనని చెప్పారు.

రాష్ట్రంలో అన్ని చోట్ల జూదం జరిగిన విధంగానే గుడివాడలో కూడా జరిగిందని అన్నారు. మహిళలతో అశ్లీల నృత్యాలు చేయిస్తున్నారని తనకు సమాచారం అందిన వెంటనే డీఎస్పీకి ఫోన్ చేసి అడ్డుకున్నానని చెప్పారు. చంద్రబాబుకు, నారా లోకేశ్ కు కేసినోలు బాగా తెలుసని అన్నారు.
 
తన కన్వెన్షన్ లో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయో, లేదో చెప్పడానికి గుడివాడ ప్రజలు ఉన్నారని... టీడీపీ నిజనిర్ధారణ కమిటీ అవసరం లేదని నాని అన్నారు. మహిళలను అడ్డం పెట్టుకుని టీడీపీ రాజకీయాలు చేస్తోందని మంత్రి మండిపడ్డారు.

More Telugu News