CCI: అమెజాన్ కు రూ.202 కోట్ల జరిమానా విధించిన సీసీఐ

  • 2019లో ఫ్యూచర్ రిటైల్ తో అమెజాన్ ఒప్పందం
  • అమెజాన్ ముంగిట ఫ్యూచర్ గ్రూప్ ను చేజిక్కించుకునే అవకాశం
  • రిలయన్స్ తో ఒప్పందం కుదుర్చుకున్న ఫ్యూచర్ గ్రూప్
  • ఆర్బిట్రేషన్ ను ఆశ్రయించిన అమెజాన్
  • ఇంతలోనే సీసీఐ నిర్ణయం
CCI imposes huge fine to Amzon

ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ కు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) భారీ జరిమానా వడ్డించింది. ఫ్యూచర్ కూపన్స్ ప్రైవేట్ లిమిటెడ్ లో వాటాల కొనుగోలు ఒప్పందాన్ని నిలిపివేస్తూ, రూ.202 కోట్ల జరిమానా చెల్లించాలంటూ అమెజాన్ ను ఆదేశించింది. ఫ్యూచర్ రిటైల్ తో ఒప్పందం నేపథ్యంలో అమెజాన్ కొన్ని ఉల్లంఘనలకు పాల్పడినట్టు తేలిందని వెల్లడించింది.

ఫ్యూచర్ గ్రూప్ కు చెందిన ఫ్యూచర్ కూపన్స్ సంస్థలో అమెజాన్ రెండేళ్ల కిందట 49 శాతం పెట్టుబడులు పెట్టింది. తద్వారా ఫ్యూచర్ గ్రూప్ లో అమెజాన్ కు 9.82 శాతం వాటా ఏర్పడింది. అంతేకాదు, ఫ్యూచర్ గ్రూప్ ను కొనుగోలు చేసేందుకు అమెజాన్ కు అధికారం లభించినట్టయింది. అయితే, ఫ్యూచర్ గ్రూప్, రిలయన్స్ మధ్య రూ,24,713 కోట్ల విలువ చేసే ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందాన్ని అమెజాన్ అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ లో సవాల్ చేసింది. అటు, ఫ్యూచర్ గ్రూప్ సీసీఐకి ఫిర్యాదు చేసింది.

ఈ నేపథ్యంలో, కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) తాజా నిర్ణయం తీసుకుంది. గతంలో ఫ్యూచర్ రిటైల్ తో ఒప్పందం కోసం తాను అమెజాన్ కు ఇచ్చిన అనుమతిని సస్పెండ్ చేసింది. రెగ్యులేటరీ అనుమతులు తీసుకునే అంశంలో అమెజాన్ కొన్ని అంశాలను దాచిందని సీసీఐ ఆరోపించింది. ఈ ఒప్పందాన్ని పునఃపరిశీలన చేయాల్సి ఉంటుందని పేర్కొంది.

More Telugu News