Mahesh Koneru: సినీ నిర్మాత మహేశ్ కోనేరు హఠాన్మరణం.. భారమైన హృదయంతో ఎన్టీఆర్ ట్వీట్

  • గుండెపోటుతో ఇవాళ ఉదయం కన్నుమూత
  • జర్నలిస్టుగా కెరీర్ ప్రారంభించిన మహేశ్
  • కంచె సినిమాతో పబ్లిసిస్ట్ గా ఎదుగుదల
  • కల్యాణ్ రామ్ ‘118’ సినిమాతో నిర్మాతగా మార్పు
  • ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ లకు పీఏగానూ విధులు
Mahesh S Koneru Dies Of Cardiac Arrest

తెలగు సినీ నిర్మాత మహేశ్ కోనేరు హఠాన్మరణం చెందారు. ఇవాళ ఉదయం గుండెపోటుతో ఆయన కన్నుమూశారు. '123 తెలుగు' అనే న్యూస్ సైట్ లో రివ్యూయర్, జర్నలిస్టుగా ఆయన తన కెరీర్ ను ప్రారంభించారు. ఆ తర్వాత ‘కంచె’ సినిమాతో ప్రచారకర్త, మార్కెటింగ్ వ్యూహకర్తగా మారారు. ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ వద్ద వ్యక్తిగత సహాయకుడిగా, పీఆర్ఓగా ఆయన పనిచేశారు.

సొంతంగా ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ అనే సంస్థను ఏర్పాటు చేసి పలు సినిమాలను నిర్మించారు. ‘118’, తిమ్మరుసు, మిస్ ఇండియా వంటి చిత్రాలను తీశారు. బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన బాహుబలి రెండు భాగాలకూ పబ్లిసిటీ, మార్కెటింగ్ టీంలో కీలకంగా వ్యవహరించారు. ‘118’ సినిమాతో నిర్మాతగా మారారు.

కాగా, ఆయన మరణవార్త విని పలువురు ప్రముఖులు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మహేశ్ చనిపోయాడంటే నమ్మలేకపోతున్నానని జూనియర్ ఎన్టీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. తన చిరకాల మిత్రుడు మహేశ్ మన మధ్య లేడనే విషయాన్ని భారమైన హృదయంతో అందరికీ తెలియజేస్తున్నానంటూ ట్వీట్ చేశారు. మహేశ్ చనిపోయాడని తెలిసి నోట మాట రావడం లేదన్నారు. ఆయన కుటుంబానికి సానుభూతి తెలియజేశారు.

మహేశ్ మరణ వార్తను జీర్ణించుకోలేకపోతున్నానని నిర్మాత శ్రీనివాసకుమార్ అన్నారు. చిన్న వయసులోనే అందరినీ వీడి వెళ్లిపోయారన్నారు. ఆయనకు టెక్నాలజీలో గొప్ప పరిజ్ఞానం ఉందని, ఎప్పుడూ ఏదో ఒక లక్ష్యంతో పనిచేసేవారని గుర్తు చేసుకున్నారు.

More Telugu News