Hyderabad: హైద‌రాబాద్‌లో మ‌రో దారుణ ఘ‌ట‌న‌.. బాలిక అనుమానాస్ప‌ద మృతి

  • మియాపూర్‌లో ఘ‌ట‌న‌
  • నిన్న 13 నెల‌ల పాప అదృశ్యం
  • క‌ళ్లు పీకేసి చంపేసిన వైనం
  • 12 ఏళ్ల‌ బాలుడిపై త‌ల్లిదండ్రుల ఆరోప‌ణ‌లు
girl murder in hyderabad

హైదరాబాద్‌లోని సైదాబాద్‌లో ఆరేళ్ల బాలిక హ‌త్యోదంతం మ‌ర‌వ‌క‌ముందే న‌గ‌రంలో మ‌రో విషాద ఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది. మియాపూర్‌లో నిన్న ఉదయం అదృశ్యమైన 13 నెల‌ల ఓ బాలిక మృత‌దేహం ఇంటి స‌మీపంలో ల‌భ్య‌మైంది. పాత ఇనుప సామ‌గ్రి, ప్లాస్టిక్ వస్తువులు ఏరుకుని అమ్మి, జీవించే ఆ బాలిక‌ తల్లిదండ్రులు బాలిక‌ను పక్కింట్లో వదిలి నిన్న ఉద‌యం ప‌నుల‌కు వెళ్లారు.

తల్లిదండ్రులు తిరిగి ఇంటికి వ‌చ్చేసరికి బాలిక కనిపించలేదు. దీంతో త‌ల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయ‌డంతో కేసు నమోదు చేసుకున్న‌ పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. బాలిక మృతిపై అన్ని కోణాల్లోనూ ద‌ర్యాప్తు చేస్తున్నారు. ఆ పాప మృత‌దేహం ఇంటి స‌మీపంలో ఖాళీ స్థ‌లంలో క‌న‌ప‌డింది. ఆ పాప కళ్లు పొడిచి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

కాగా, తల్లిదండ్రులు చెబుతోన్న‌ వివరాల్లో స్పష్టత లేద‌ని పోలీసులు అంటున్నారు. త‌ల్లిదండ్రుల‌ను పోలీస్‌ స్టేషన్‌కు పిలిపించి ప్ర‌శ్నిస్తున్నారు. ఓ గుర్తు తెలియని 12 ఏళ్ల బాలుడు నిన్న సాయంత్రం త‌మ‌ పాపను తీసుకెళ్లినట్లు త‌ల్లిదండ్రులు పోలీసులకు చెప్పారు. అనంత‌రం ఆ బాలుడు కూడా అదృశ్యమైనట్లు తెలుస్తోంది. దీనిపై పోలీసులు విచార‌ణ జ‌రుపుతున్నారు. బాలిక మృత‌దేహాన్ని గాంధీ ఆసుప‌త్రికి త‌ర‌లించారు.

More Telugu News