వైసీపీ హయాంలో సచివాలయ నియామకాల్లో భారీ స్కామ్: టీడీపీ నేత విజయకుమార్
- వైసీపీ హయాంలో గ్రామ సచివాలయ నియామకాల్లో భారీ అవకతవకలు
- అర్హులను కాదని వైసీపీ కార్యకర్తలకు ఉద్యోగాలు ఇచ్చారన్న టీడీపీ
- ఏపీపీఎస్సీ ఉద్యోగినికే ఫస్ట్ ర్యాంక్ రావడంపై అనుమానాలు
- 90 శాతం పోస్టులు తమ వారికేనన్న విజయసాయి వ్యాఖ్యల ప్రస్తావన
శనివారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. లక్షలాది మంది అర్హులకు గత ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందని పేర్కొన్నారు. ఏపీపీఎస్సీ పరీక్షల విభాగంలో ఔట్సోర్సింగ్ ఉద్యోగినిగా పనిచేస్తున్న అనితారెడ్డి అనే మహిళ, పంచాయతీ కార్యదర్శి గ్రేడ్-5 పరీక్షలో 150 మార్కులకు గాను 112.5 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంకు ఎలా సాధించారని ఆయన ప్రశ్నించారు. అలాగే, ఆర్ట్స్, సైన్స్ రెండు విభాగాల్లోనూ టాపర్గా నిలిచిన దొడ్డ వెంకటరెడ్డికి, ఏపీపీఎస్సీలోని ఓ ఉన్నతాధికారితో ఉన్న సంబంధం ఏమిటని నిలదీశారు.
గతంలో 90 శాతం ఉద్యోగాలు తమ కార్యకర్తలకే ఇచ్చామని విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలను విజయకుమార్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఆ వ్యాఖ్యలే అప్పటి వాస్తవ పరిస్థితికి అద్దం పడుతున్నాయని అన్నారు. పారదర్శకత గురించి మాట్లాడే నైతిక హక్కు వైసీపీ నేతలకు లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తున్న డీఎస్సీ నియామకాలపై వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి రాజకీయ లబ్ధి కోసం నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వంపై బురద జల్లడం మానుకోవాలని వైసీపీ నేతలకు ఆయన హితవు పలికారు.