ramnath kovind: చరిత్ర సృష్టించిన భ‌వీనా ప‌టేల్‌పై దేశ వ్యాప్తంగా ప్ర‌ముఖుల ప్ర‌శంస‌ల వ‌ర్షం

  •  పారాలింపిక్స్ లో పతకాన్ని అందించిన‌ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి
  • ఆమె నిబద్ధ‌త, నైపుణ్యాల వ‌ల్ల దేశానికి మంచి పేరు వ‌చ్చింద‌న్న రాష్ట్ర‌ప‌తి
  • ఆమె చ‌రిత్ర లిఖించిందన్న మోదీ
ramnath praises baveena patel

టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి భవీనా పటేల్ టోక్యో పారాలింపిక్స్ లో భారత్ కు పతకాన్ని అందించి, చరిత్ర సృష్టించిన విష‌యం తెలిసిందే. పారాలింపిక్స్‌ చరిత్రలోనే టేబుల్‌ టెన్నిస్‌లో మ‌న‌కు పతకం రావ‌డం ఇదే తొలిసారి. దీంతో ఆమెపై దేశ వ్యాప్తంగా ప్ర‌ముఖులు ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు.

టోక్యో పారాలింపిక్స్‌లో సిల్వ‌ర్ మెడల్ సాధించి భవీనాబెన్‌ ప‌టేల్‌ దేశంలోని క్రీడాకారుల్లో, క్రీడాభిమానుల్లో స్ఫూర్తిని నింపింద‌ని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్ ప్ర‌శంసించారు. ఆమె నిబద్ధ‌త, నైపుణ్యాల వ‌ల్ల దేశానికి మంచి పేరు వ‌చ్చింద‌ని చెప్పారు. ఇటువంటి గొప్ప విజ‌యాన్ని సాధించిన ఆమెకు అభినంద‌న‌లు తెలుపుతున్నాన‌ని ట్వీట్ చేశారు.

భ‌వీనా ప‌టేల్ ను ప్రధాని మోదీ కూడా అభినందించారు. ఆమె చ‌రిత్ర లిఖించింద‌ని, ఆమె జీవితం చాలా మందికి స్ఫూర్తివంత‌మైంద‌ని చెప్పారు. ఆమె జీవన ప్ర‌యాణం దేశంలోని యువ‌త‌ను క్రీడ వైపున‌కు ఆక‌ర్షిస్తోంద‌ని తెలిపారు.  భవీనా బెన్‌ పటేల్ కు రాజ‌కీయ, క్రీడా ప్ర‌ముఖుల నుంచి ప్ర‌శంస‌లు ద‌క్కుతున్నాయి. ఆమె సాధించిన విజ‌యంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, క్రికెట‌ర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించారు. ఆమె మ‌రిన్ని విజ‌యాలు సాధించాల‌ని ఆకాంక్షించారు.

కాగా, భ‌వీనా ప‌టేల్ గుజరాత్‌లోని మెహసానాకు చెందిన క్రీడాకారిణి. ఆమె 2016 రియోలో జ‌రిగిన‌ పారాలింపిక్స్‌కు కూడా ఎంపికైన‌ప్ప‌టికీ కొన్ని కారణాల వల్ల పోటీల్లో పాల్గొనలేకపోయింది. అయిన‌ప్ప‌టికీ మ‌రింత సాధ‌న చేసి ఈ సారి విజ‌యం సాధించింది.

More Telugu News