New Delhi: ఢిల్లీలో మరిన్ని సడలింపులు: ప్రకటించిన సీఎం కేజ్రీవాల్​

  • వారంలో ఏడు రోజులూ షాపులు ఓపెన్
  • 50 శాతం సామర్థ్యంతో రెస్టారెంట్లు
  • ప్రభుత్వ ఆఫీసుల్లో ఫుల్, ప్రైవేటులో సగం మంది స్టాఫ్
  • వారాంతపు సంతలకూ అనుమతి
Delhi Eases Curbs From Tomorrow

కరోనా కేసులు భారీగా తగ్గడంతో ఇక ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ మరిన్ని సడలింపులను ఇచ్చింది. ఇప్పటికే షాపింగ్ మాళ్లను సరి–బేసి విధానంలో తెరుస్తున్నారు. అయితే, రేపటి నుంచి వారంలో ఏడు రోజులూ షాపులను తెరిచేందుకు కేజ్రీవాల్ ప్రభుత్వం అనుమతినిచ్చింది. అయితే, ఇది కేవలం ట్రయల్స్ మాత్రమేనని, ఓ వారం పాటు చూశాక కేసులు రావట్లేదనుకుంటేనే తదుపరి సడలింపులు ఇస్తామని కేజ్రీ తెలిపారు.

అయితే, షాపుల వేళలు ఇప్పుడున్నట్టే ఉదయం 10 నుంచి రాత్రి 8 గంటల వరకుంటాయని చెప్పారు. ప్రస్తుతం టేక్ అవేకే పర్మిషన్ ఉన్న రెస్టారెంట్లను 50 శాతం సామర్థ్యంతో నడిపేందుకు ఓకే చెప్పారు. వారాంతపు సంతలనూ సగం సామర్థ్యంతో అనుమతించనున్నట్టు ప్రకటించారు. ఒక్కో మున్సిపల్ జోన్ లో రోజుకు ఒక సంత మాత్రమే జరగాలన్నారు. సెలూన్లను ఓపెన్ చేస్తున్నా.. స్పాలు మాత్రం మూసే ఉంటాయన్నారు.

ప్రభుత్వ కార్యాలయాలను పూర్తి సామర్థ్యం, ప్రైవేట్ ఆఫీసులను సగం సామర్థ్యంతో తెరుచుకోవచ్చన్నారు. మెట్రో, బస్సులు 50 శాతం సామర్థ్యంతోనే ట్రిప్పులు వేస్తాయన్నారు. పాఠశాలలు, కళాశాలలు, విద్యా సంస్థలు, స్విమ్మింగ్ పూల్స్, అమ్యూజ్ మెంట్ పార్కులు, వాటర్ పార్కులు పూర్తిగా మూసే ఉంటాయన్నారు. గుళ్లు, ప్రార్థనా మందిరాలను తెరిచినా భక్తులకు మాత్రం అనుమతి ఉండదన్నారు.

More Telugu News