Joe Biden: అమెరికా-రష్యా దేశాల అధ్య‌క్షుల స‌మావేశం ఖ‌రారు!

  • జూన్‌ 16న జెనీవాలో భేటీ
  • ధ్రువీక‌రించిన‌ శ్వేత‌సౌధం
  • బైడెన్, పుతిన్‌ పూర్తి స్థాయిలో చర్చ 
  Joe Biden to meet  Putin

అమెరికా-రష్యా దేశాల అధ్య‌క్షులు జో బైడెన్, పుతిన్‌ త్వ‌ర‌లోనే స‌మావేశం అయ్యే అవ‌కాశం ఉంద‌ని ఇటీవ‌ల వార్త‌లు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఇరు దేశాల మ‌ధ్య స‌త్సంబంధాల విష‌యంలో ముందడుగు పడుతుంద‌నే న‌మ్మ‌కం ఉంద‌ని జో బైడెన్ కూడా ఇటీవ‌ల మీడియాకు చెప్పారు. ఈ నేపథ్యంలో వారిద్ద‌రి భేటీపై తాజాగా  అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చింది. జూన్‌ 16న జెనీవాలో వారు భేటీ కానున్నట్లు ప్ర‌క‌ట‌న వ‌చ్చింది.

ఈ భేటీ వార్త‌ల‌ను శ్వేత‌సౌధం కూడా ధ్రువీకరించింది. ఇరు దేశాల‌ సంబంధాలపై బైడెన్, పుతిన్‌ పూర్తి స్థాయిలో చర్చించే అవకాశం ఉందని వైట్‌హౌస్‌ ప్రెస్‌ సెక్రెటరీ జెన్‌ సాకీ తెలిపారు. కాగా, ఉక్రెయిన్-రష్యా సరిహద్దుల్లో రష్యా తన సైన్యాన్ని మోహరించడంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. ఉక్రెయిన్ అంశంతో పాటు మానవ హక్కుల ఉల్లంఘ‌న‌, సైబర్ భ‌ద్ర‌త‌ వంటివాటిపై రష్యా, అమెరికా మధ్య భేదాభిప్రాయాలు ఉన్నాయి. ఇవి ఏవీ ఇరు దేశాల అధ్య‌క్షుల మ‌ధ్య భేటీకి ఆటంకం కాబోవ‌ని ఇటీవ‌లే అమెరికా తెలిపింది.

More Telugu News