Telangana: ఏపీ అంబులెన్సులను అడ్డుకుంటున్న తెలంగాణ పోలీసులపై.. హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్

  • ప్రజల ప్రాణాలతో చెలగాటం వద్దని ఇంతకు ముందే హెచ్చరించిన తెలంగాణ హైకోర్టు
  • అంబులెన్సులను అడ్డుకుంటే కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని హెచ్చరిక
  • నిన్న రాత్రి నుంచి మళ్లీ అంబులెన్సులను అడ్డుకుంటున్న పోలీసులు
petition filed against TS Police in High Court

ఏపీ నుంచి కరోనా పేషెంట్లతో వస్తున్న అంబులెన్సులను అడ్డుకుంటున్న తెలంగాణ పోలీసులపై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైంది. మాజీ ఐఆర్ఎస్ అధికారి గరిమళ్ల వెంకటకృష్ణారావు ఈ పిటిషన్ ను దాఖలు చేశారు. రాష్ట్ర సరిహద్దుల్లో ఏపీ నుంచి కరోనా పేషెంట్లతో వస్తున్న అంబులెన్సులను ఆపేస్తున్నారంటూ నాలుగు రోజుల క్రితం కూడా తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.

ఆ పిటిషన్ పై తక్షణమే స్పందించిన హైకోర్టు పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజల ప్రాణాలతో చెలగాటం వద్దని నాడు హెచ్చరించింది. అంబులెన్సులను రాష్ట్రంలోకి అనుమతించాలని ఆదేశించింది. తమ ఆదేశాలను పాటించకపోతే కోర్టు ధిక్కరణ కింద చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించింది.

ఇంత జరిగినా ఏపీ, తెలంగాణ సరిహద్దుల్లో మళ్లీ అదే పరిస్థితి నెలకొంది. తెలంగాణకు వచ్చే అన్ని రహదారుల్లో అంబులెన్సులను పోలీసులు అడ్డుకుంటున్నారు. దీంతో పెద్ద సంఖ్యలో అంబులెన్సులు, వాహనాలు సరిహద్దుల వద్ద నిలిచిపోయాయి. వాస్తవానికి హైకోర్టు ఆదేశాల మేరకు ఏపీ నుంచి వస్తున్న అంబులెన్సులను తెలంగాణ పోలీసులు అనుమతించారు.

అయితే, నిన్న రాత్రి  తెలంగాణ ప్రభుత్వం కొత్త ఉత్తర్వులు జారీ చేయడంతో... పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. రాష్ట్రంలోని ఆసుపత్రుల్లో బెడ్లు దొరికితేనే ఏపీ పేషెంట్లను అనుమతించాలని టీఎస్ ప్రభుత్వం వాటిలో ఆదేశించింది. దీంతో, తెలంగాణ పోలీసులు ఏపీ నుంచి వస్తున్న.. తగిన పత్రాలు లేని  అంబులెన్సులను అడ్డుకుంటున్నారు. ఈ నేపథ్యంలో హైకోర్టు ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

More Telugu News