Sajjala Ramakrishna Reddy: క్లిష్ట సమయంలో నీచ రాజకీయాలా?: చంద్రబాబుపై సజ్జల ఆగ్రహం

  • సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిట్ పై స్పందించిన సజ్జల
  • వ్యాక్సిన్ విధానంపై కేంద్రం స్పష్టత ఇచ్చిందని వెల్లడి
  • వ్యాక్సిన్లపై చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపణ
  • ప్రజలను బతకనివ్వరా? అంటూ మండిపాటు
Sajjala fires on TDP Chief Chandrababu

కరోనా వ్యాక్సినేషన్ అంశం కేంద్రం పర్యవేక్షణలోని అంశమని, కేంద్రం కేటాయించిన మేరకు వ్యాక్సిన్లు రాష్ట్రానికి వస్తాయని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. కేంద్రం ఇవాళ సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో వ్యాక్సిన్లపై స్పష్టత ఇచ్చిందని, ఇంత క్లిష్ట పరిస్థితుల్లో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని సజ్జల మండిపడ్డారు. గత 10 రోజులుగా చంద్రబాబు, ఆయన ముఠా సభ్యులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మీరసలు రాష్ట్రంలో ప్రజలను బతకనివ్వ దలుచుకున్నారా? లేదా? అని ప్రశ్నించారు. పొద్దున లేచినప్పటి నుంచి వ్యాక్సిన్లు ఎందుకు తీసుకురావడంలేదు? ప్రజల ప్రాణాలను గాలికి వదిలేస్తారా? అంటూ తీవ్రస్థాయిలో ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తద్వారా ప్రజలను మరింత రెచ్చగొట్టి, వారిని రోడ్లపైకి తీసుకువచ్చి కొవిడ్ మరింత వ్యాప్తి చెందేలా చేస్తున్నారని విమర్శించారు. ఓవైపు ప్రపంచం, దేశం కరోనా సంక్షోభంతో అల్లాడుతుంటే, ఈ విధంగా దుష్ప్రచారం చేస్తున్న టీడీపీ ముఠాకు ఏ శిక్ష వేయాలని సజ్జల వ్యాఖ్యానించారు.

విపత్కర పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో పౌర సమాజాన్ని జాగృతం చేసి, వారికి తగిన జాగ్రత్తలు చెప్పడం బాధ్యతాయుతమైన రాజకీయ నాయకుడు చేయాల్సిన పని అని సజ్జల హితవు పలికారు. వ్యాక్సిన్ల సేకరణలో తాము కమీషన్ల కోసం కక్కుర్తి పడుతున్నట్టు నీచ ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. వీలైతే ప్రభుత్వానికి మద్దతుగా నిలిచి, ఏవైనా లోటుపాట్లు ఉంటే సూచనలు ఇవ్వాలని హితవు పలికారు. కానీ, జూమ్ లో వరుసగా ప్రసంగాలు ఇస్తూ ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నారని విమర్శించారు.

వ్యాక్సిన్లు ప్రస్తుతం దేశంలో రెండు రకాలే ఉన్నాయి కాబట్టి, తాము ఆ అంశంలో ఏమీ చేయలేకపోతున్నామని సజ్జల విచారం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కొవిడ్ కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటూ సీఎం జగన్ ప్రభుత్వం తీవ్రంగా శ్రమిస్తోందని అన్నారు.

More Telugu News