Delhi HC: ఇప్పటికే నిండా మునిగాం: కేంద్రంపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం

  • ఆక్సిజన్ లేక ఆసుపత్రిలో ఎనిమిది మంది చనిపోయారు
  • ఈ పరిస్థితుల్లో మేము కళ్లు మూసుకుని ఉండలేము
  • ఢిల్లీకి పూర్తి స్థాయి ఆక్సిజన్ సరఫరా చేయాలి
Supply full oxygen quota to Delhi orders Delhi High Court

ఢిల్లీలోని అన్ని ఆసుపత్రులకు ఆక్సిజన్ కోటాను పూర్తి స్థాయిలో పంపిణీ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. ఎట్టి పరిస్థితుల్లో ఆసుపత్రులకు ఆక్సిజన్ అందించాలని చెప్పింది. సెకండ్ వేవ్ సమయంలో ఇప్పటికే నిండా మునిగిపోయామని... ఇప్పటికైనా అన్నీ ఏర్పాటు చేయాలని తెలిపింది. మీరు ఆక్సిజన్ కేటాయింపులు చేశారని... వాటిని పూర్తిగా అందించాల్సిన బాధ్యత మీపై ఉందని చెప్పారు.

ఆక్సిజన్ లేక ఒక ఆసుపత్రిలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారని... ఈ పరిస్థితుల్లో కూడా తాము కళ్లు మూసుకుని కూర్చోలేమని వ్యాఖ్యానించింది. 80 నిమిషాల పాటు ఆక్సిజన్ సరఫరా ఆగిపోవడంతో ఢిల్లీలోని బాత్రా ఆసుపత్రిలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనను ఉద్దేశించి హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.

ఢిల్లీకి తక్షణమే 490 టన్నుల మెడికల్ ఆక్సిజన్ ను సరఫరా చేయాలంటూ కేంద్ర ప్రభుత్వానికి తాము సూచిస్తున్నామని హైకోర్టు తెలిపింది. ట్యాంకర్లను ఏర్పాటు చేయాల్సిన బాధ్యత కూడా కేంద్రానిదే అని చెప్పింది. ఏప్రిల్ 20న ఢిల్లీకి ఈ కేటాయింపులు చేశారని.. అయితే ఒక్కరోజు కూడా ఢిల్లీ పూర్తి కోటాను అందుకోలేదని వ్యాఖ్యానించింది. ఇప్పటికైనా కేంద్రం ఆక్సిజన్ ను సరఫరా చేయకపోతే.. కోర్టు ధిక్కరణగా భావించాల్సి ఉంటుందని హెచ్చరించింది.

More Telugu News