Nimmagadda Ramesh Kumar: ఈ నెల 31తో నా పదవీ కాలం పూర్తవుతుంది.. ఇక‌ ఎన్నికలను నిర్వ‌హించ‌లేను: నిమ్మ‌గ‌డ్డ‌

  • కొత్త అధికారి జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను నిర్వ‌హిస్తారు
  • ఏకగ్రీవాలు జరిగిన చోట ఫిర్యాదు చేసుకోవచ్చు
  • హైకోర్టు తీర్పునకు అనుగుణంగానే ఈ ఆదేశాలిస్తున్నాం 
cant conduct eletion says nimmagadda

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో నిర్వ‌హించాల్సిన‌ జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను కూడా రాష్ట్ర‌ ఎన్నికల కమిషనర్ నిమ్మ‌గ‌డ్డ ప్రసాద్ పూర్తి చేస్తారా? అన్న సందిగ్ధ‌త నెల‌కొన్న విష‌యం తెలిసిందే. ఈ విష‌యంపై ఆయ‌న ఈ రోజు మీడియాతో మాట్లాడారు.

ఈ నెల 31వ తేదీతో తన పదవీ కాలం పూర్తవుతుంద‌ని ఆయ‌న వివ‌రించారు. దీంతో ఆ బాధ్యతలను కొత్తగా వచ్చే ఎన్నికల అధికారి నిర్వహిస్తారని స్ప‌ష్టం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో తాను ఎన్నికల షెడ్యూలును విడుదల చేయలేనని తెలిపారు. అయితే, ఆ ఎన్నికలపై ఏకగ్రీవాలు జరిగిన చోట ఫిర్యాదు చేసుకోవచ్చ‌ని సూచించారు. బెదిరింపుల వ‌ల్ల‌ నామినేషన్లను దాఖ‌లు చేయ‌లేక‌పోయిన వారు రిటర్నింగ్ అధికారులకు ఫిర్యాదు చేసుకునే అవకాశం ఉందని వివ‌రించారు.

హైకోర్టు తీర్పునకు అనుగుణంగానే ఈ ఆదేశాలిస్తున్నామని తెలిపారు. ఇప్ప‌టికే ఆంధ్ర‌ప్రదేశ్‌లో ముగిసిన గ్రామ పంచాయతీ, పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోలీసుల‌తో పాటు ప్రభుత్వ యంత్రాంగం స‌మ‌ర్థంగా ప‌నిచేసింద‌ని చెప్పారు.

ప్ర‌స్తుతం దేశంలోని నాలుగు రాష్ట్రాల‌తో పాటు ఓ కేంద్ర పాలిత ప్రాంతానికి జ‌రుగుతోన్న‌ ఎన్నికల్లో పోలింగ్ సిబ్బందికి వ్యాక్సినేషన్‌ను నిర్వహించాలని ఎన్నికల సంఘం ఆదేశించిందని తెలిపారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోనూ పోలింగ్ సిబ్బందికి వెంటనే వ్యాక్సిన్లు వేసే ప్రక్రియను చేపట్టాలని ఆదేశించిన‌ట్లు చెప్పారు.

More Telugu News