Pakistan: 'పాకిస్థాన్ డే' సందర్భంగా.. ఇమ్రాన్ ఖాన్ కు లేఖ రాసిన ప్రధాని మోదీ!

  • స్నేహపూర్వక సంబంధాలనే కోరుతున్నాం
  • నమ్మకమనే పునాదులు మాత్రం తప్పనిసరి
  • ఉగ్రవాదానికి పాక్ దూరం కావాలన్న మోదీ
Narendra Modi Letter to Imran Khan

పాకిస్థాన్ తో స్నేహపూర్వక సంబంధాలను తాము కోరుకుంటున్నామని, ఇదే సమయంలో ఆ సంబంధాలు నమ్మకమనే పునాదులపై నిలబడి వుండాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ మేరకు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు మోదీ ఓ లేఖను రాశారు. తొలుత పాకిస్థాన్ ఉగ్రవాదానికి దూరం కావాల్సి వుందని మోదీ కోరారు. 'పాకిస్థాన్ డే' సందర్భంగా ఆ దేశ ప్రజలకు మోదీ శుభాకాంక్షలు తెలుపుతూ లేఖను పంపారు.

"ఓ పొరుగు దేశంగా పాకిస్థాన్ వాసులతో భారత్ స్నేహపూర్వక సంబంధాలను కోరుకుంటున్నది. పాకిస్థాన్ డే సందర్భంగా ఇమ్రాన్ ఖాన్, దేశ ప్రజలకు నా శుభాకాంక్షలు" అని మోదీ తన లేఖలో పేర్కొన్నారు. కాగా, ఈ లేఖ ప్రతి సంవత్సరమూ పంపించే రొటీన్ లెటర్ మాత్రమేనని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఇదే సమయంలో ఇండియా, పాకిస్థాన్ మధ్య సింధూ నదీ జలాల వివాదంపై చర్చలు జరుగుతుండటం గమనార్హం. రెండు దేశాల మధ్య సత్సంబంధాల దిశగా, సానుకూల అడుగులు పడుతున్న వేళ, మోదీ ఈ లేఖను పంపారు.

గత నెలలో ఇరు దేశాల మధ్యా జరిగిన చర్చల్లో వాస్తవాధీన రేఖ వెంబడి కాల్పుల విరమణను పాటించాలని నిర్ణయానికి వచ్చిన సంగతి తెలిసిందే. ఆపై రెండున్నరేళ్ల తరువాత తొలిసారిగా సోమవారం నాడు పాక్ అధికారులు ఇండియాకు రాగా, నదీ జలాల పంపిణీపై చర్చలు జరిగాయి. 2019లో జమ్మూ కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేస్తూ, కేంద్రం చట్టం చేసిన తరువాత పాక్ తో సంబంధాలు మరింత దిగజారిన సంగతి తెలిసిందే.

More Telugu News