Atchannaidu: పార్టీకి నష్టం కలిగించే వారిపై క్రమశిక్షణ చర్యలు తప్పవు: అచ్చెన్నాయుడు హెచ్చరిక

  • ఏపీలో మున్సిపల్ ఎన్నికల కోలాహలం
  • ఈ మధ్యాహ్నం 3 గంటలతో ముగియనున్న నామినేషన్ల ఉపసంహరణ
  • వైసీపీ ఏకగ్రీవాల దూకుడు
  • పలుచోట్ల వైసీపీలోకి టీడీపీ అభ్యర్థులు
  • పార్టీ విధానాలకు వ్యతిరేకంగా వ్యవహరించొద్దన్న అచ్చెన్న
Atchannaidu warns party cadre

ఏపీలో మున్సిపల్ ఎన్నికల వేడి రాజుకుంది. నామినేషన్ల ఉపసంహరణ సమయం దగ్గరపడే కొద్దీ ఏకగ్రీవాల జోరు మరింత అధికమైంది. పలు ప్రాంతాల్లో టీడీపీ అభ్యర్థులు వైసీపీలో చేరుతున్నట్టు మీడియాలో వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో స్పందించారు.

పార్టీకి నష్టం కలిగించేవారిపై క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు. స్థానిక సంస్థల ఎన్నికలపై టీడీపీ విధానాలకు విరుద్ధంగా ఎవరైనా వ్యక్తిగత ప్రకటనలు జారీ చేస్తే క్రమశిక్షణ చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. వైసీపీ దౌర్జన్యాల పట్ల టీడీపీ శ్రేణులు ప్రజాస్వామ్యయుతంగా పోటీచేయాలని అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు.

కాగా, జేసీ సోదరుల కంచుకోటగా భావిస్తున్న తాడిపత్రిలో రెండు స్థానాల్లో వైసీపీ ఏకగ్రీవాలు సాధించగా, ఎమ్మెల్యే పెద్దారెడ్డి కుమారుడు బరిలో ఉన్న వార్డులో వైసీపీకి ఏకగ్రీవం అయింది. ఈ నేపథ్యంలో టీడీపీ క్యాంపు రాజకీయాలకు తెరలేపింది. టీడీపీ అభ్యర్థులను అనంతపురంలోని జేసీ పవన్ కార్యాలయంలో ఉంచినట్టు తెలుస్తోంది.

అటు, కల్యాణదుర్గం, రాయదుర్గంలోనూ ఇదే తరహా పరిస్థితులు నెలకొనడంతో... టీడీపీ అభ్యర్థులను కాపాడుకునేందుకు కర్ణాటక పర్యటన ప్లాన్ చేసినట్టు సమాచారం. ధర్మవరంలో 10 వార్డుల్లో వైసీపీ ఏకగ్రీవం కాగా, ధర్మవరంలో మకాం వేసిన పరిటాల శ్రీరాం పరిస్థితిని సమీక్షిస్తున్నారు. తమ అభ్యర్థులను వెంకటాపురం తరలించారు. అనంతపురంలో టీడీపీ అభ్యర్థులు అజ్ఞాతంలోకి వెళ్లడంతో అక్కడి పరిస్థితులు ఉత్కంఠగా మారాయి.

కాగా పలాసలో నలుగురు టీడీపీ అభ్యర్థులు వైసీపీలో చేరారు. జీవీఎంసీలో టీడీపీ అభ్యర్థి బాక్సర్ రాజు వైసీపీలో చేరాడు.

More Telugu News