Srishant: ఐపీఎల్ వేలంలో శ్రీశాంత్ కు దక్కని చోటు!

  • ఈ నెల 18న జరగనున్న వేలం
  • 1,114 మంది దరఖాస్తు చేసుకోగా, 292 పేర్లతో జాబితా
  • శ్రీశాంత్ పై ఆసక్తిని చూపని ఫ్రాంచైజీలు
No Name of Srishant in IPL Auction List

2021 సీజన్ కు ఐపీఎల్ వేలాన్ని ఈ నెల 18న నిర్వహించనున్న నేపథ్యంలో, ఫ్రాంచైజీ యాజమాన్యాల సూచన మేరకు మొత్తం 292 మందిని షార్ట్ లిస్ట్ చేసిన బీసీసీఐ (బోర్డ్ ఆఫ్ క్రికెట్ కంట్రోల్ ఇన్ ఇండియా) వారి పేర్లను ప్రకటించింది. ఈ జాబితాలో కేరళ స్పీడ్ స్టర్, క్రికెట్ నుంచి నిషేధాన్ని ఎదుర్కొని, తిరిగి ఇటీవలే మళ్లీ మైదానంలోకి ప్రవేశించిన శ్రీశాంత్ పేరు లేకపోవడం గమనార్హం. ఆయనపై ఏ ఫ్రాంచైజీ కూడా ఆసక్తిని చూపకపోవడంతోనే బీసీసీఐ తుది వేలం జాబితాలో అతని పేరు చేరలేదని సమాచారం.

ఇక వేలంలో తమను జోడించాలని క్రికెట్ ఆడే దేశాలకు చెందిన ఆటగాళ్లు మొత్తం 1,114 మంది దరఖాస్తు చేసుకోగా, 292 మందిని మాత్రమే వేలంలోకి తీసుకున్నారు. గరిష్ఠంగా అన్ని ఫ్రాంచైజీల్లో ఖాళీలను పరిశీలిస్తే, 61 మందిని మాత్రమే తీసుకునే అవకాశం ఉంది. వీరిలో 22 మంది విదేశీయులను మాత్రమే తీసుకునేందుకు వీలుంది.

ఇక ఇదే సమయంలో, బీసీసీఐ తన ప్రకటనలో 'వివో ఐపీఎల్ 2021' అని పేర్కొనడంతో ఈ సంవత్సరం సీజన్ కు కూడా వివో ప్రధాన స్పాన్సరర్ గా కొనసాగుతుందని తెలుస్తోంది.

More Telugu News