Vijay Sai Reddy: మేనిఫెస్టోను ఉపసంహరించుకోమని నిమ్మగడ్డ సుతిమెత్తని హెచ్చరిక జారీ చేస్తున్నారు: విజయసాయిరెడ్డి ఎద్దేవా

  • టీడీపీ మేనిఫెస్టోను ప్రజలు మొదటి రోజే తిరస్కరించారు
  • అయినా చంద్రబాబుకు తెలియక విడుదల చేశారా?- విజయసాయి  
  • ఏకగ్రీవాలు అంటే  నచ్చవట‌
  • లక్ష్మణరేఖ దాటుతున్నారు నిమ్మగడ్డ వారు: అంబ‌టి
vijaya sai slams nimmagadda

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పంచాయతీ ఎన్నికల నేప‌థ్యంలో టీడీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే, పార్టీ రహితంగా జరుగుతున్న స్థానిక ఎన్నిక‌ల‌కు మేనిఫెస్టో విడుద‌ల చేయ‌డం స‌రికాదంటూ వైసీపీ చేసిన ఫిర్యాదుతో దాన్ని రద్దు చేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోవ‌డంపై వైసీపీ నేత‌లు స్పందిస్తూ చుర‌క‌లంటించారు.

'టీడీపీ పంచాయతీల ఎన్నికల మేనిఫెస్టోను ప్రజలు మొదటి రోజే తిరస్కరించారు. ఇప్పుడు ఉపసంహరించుకోవాలని నిమ్మగడ్డ సుతిమెత్తని హెచ్చరిక జారీ చేస్తున్నారు. అయినా చంద్రబాబుకు తెలియక విడుదల చేశారా? ఎల్లో మీడియాను రోజంతా ఎంగేజ్ చేయడానికి ఆ తతంగం పెట్టుకున్నాడు' అని వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి విమ‌ర్శ‌లు గుప్పించారు.

'ఏకగ్రీవాలు అంటే మాకు నచ్చవు.. పోటీ చేయవలసిందే.. వర్గాలుగా విడిపోవాల్సిందే.. కొట్టుకు చావవలసిందే.. పల్లెలు ప్రశాంతంగా ఉంటే అసలే గిట్టదు..' అనేలా కొంద‌రు వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని వైసీపీ నేత అంబ‌టి రాంబాబు విమ‌ర్శించారు. 'లక్ష్మణరేఖ దాటుతున్నారు "నిమ్మగడ్డ" వారు' అంటూ ట్వీట్ చేశారు.

More Telugu News