Anam Ramanarayana Reddy: నన్నే అవమానిస్తారా?.. క్రిమినల్ కేసులు పెడతా: అధికారులను హెచ్చరించిన ఆనం
నిన్న జరిగిన గణతంత్ర వేడుకలకు తనను ఆహ్వానించకపోవడంపై నెల్లూరు జిల్లా వెంకటగిరి వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నేడు మీడియాతో మాట్లాడిన ఆయన.. అధికారుల తీరుపై కోర్టును ఆశ్రయిస్తానని చెప్పారు. అవసరమైతే క్రిమినల్ కేసులు కూడా పెడతానని హెచ్చరించారు. వేడుకలకు తనన ఆహ్వానించకపోవడం అధికారుల నిర్లక్ష్య ధోరణికి పరాకాష్ట అని మండిపడ్డారు. అధికారులతో తాడోపేడో తేల్చుకుంటానన్నారు. వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత తాను అనేక అవమానాలు ఎదుర్కొన్నానని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల తీరుపై సిగ్గుపడాలో, బాధపడాలో అర్థం కావడం లేదని ఆనం ఆవేదన వ్యక్తం చేశారు.