Prabhas: 'రాధే శ్యామ్' క్లైమాక్స్ .. నాలుగు సెట్స్ లో చిత్రీకరణ!

  • రామోజీ ఫిలిం సిటీలో 'రాధే శ్యామ్' క్లైమాక్స్ 
  • ఇటలీని ప్రతిబింబించే నాలుగు సెట్స్
  • ఈ నెలాఖరు వరకు ఆ సెట్స్ లోనే షూటింగ్
  • వచ్చే వేసవిలో ప్రేక్షకుల ముందుకు సినిమా  
Radhe Shyam climax shoot in four sets

'బాహుబలి' చిత్రాల తర్వాత నుంచి ప్రభాస్ ఇమేజ్ మారిపోవడంతో అందుకు తగ్గట్టుగానే ఆయన చిత్రాల నిర్మాణం భారీ బడ్జెట్టుతో జరుగుతోంది. ప్రభాస్ కు హిందీ మార్కెట్టు కూడా బాగా పెరగడంతో దానిని కూడా దృష్టిలో పెట్టుకుని చిత్రనిర్మాణాన్ని రిచ్ గా కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం తను నటిస్తున్న 'రాధే శ్యామ్' చిత్రం నిర్మాణం కూడా భారీగానే జరుగుతోంది.

ఇప్పటికే ఈ చిత్రం కోసం లాక్ డౌన్ కి ముందు జార్జియాలో ఒక భారీ షెడ్యూలు.. ఇటీవల ఇటలీలో నెల రోజుల మరో భారీ షెడ్యూలు షూటింగు నిర్వహించారు. ఇప్పుడు క్లైమాక్స్ దృశ్యాల చిత్రీకరణను కూడా భారీ ఎత్తున చేస్తున్నారు. ఇందుకోసం హైదరాబాదు, రామోజీ ఫిలిం సిటీలో మొత్తం నాలుగు సెట్స్ వేశారు. ఇవన్నీ కూడా పాతకాలం నాటి ఇటలీ వాతావరణాన్ని ప్రతిబింబిస్తాయి.

ప్రస్తుతం ఈ సెట్స్ లో జరుగుతున్న చిత్రీకరణలో హీరో, హీరోయిన్లు, ఇతర ప్రధాన తారాగణం పాల్గొంటున్నారు. ఈ నెల 13 నుంచి జరుపుతున్న ఈ క్లైమాక్స్ చిత్రీకరణ ఈ నెలాఖరు వరకు ఈ నాలుగు సెట్స్ లోనూ కొనసాగుతుంది. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్, పూజ హెగ్డే జంటగా నటిస్తున్నారు. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ చేస్తారు. తెలుగుతో పాటు హిందీ, తమిళ భాషల్లో కూడా ఏకకాలంలో రిలీజ్ చేస్తారు.

More Telugu News