Ramcharan: తమిళ దర్శకుడితో చరణ్ పాన్ ఇండియా ఫిలిం?

  • 'బాహుబలి' నుంచి పెరిగిన తెలుగు సినిమా స్థాయి 
  • స్టార్ హీరోల పాన్ ఇండియా సినిమాల ప్లానింగ్
  • తమిళ దర్శకుడు మోహన్ రాజాతో చరణ్ చర్చలు  
Charan plans to do a pan India film

ఇటీవలి కాలంలో తెలుగు సినిమా స్థాయి బాగా పెరిగింది. 'బాహుబలి' సినిమా నుంచి ఇది బాగా ఎక్కువైంది. తెలుగు స్టార్ హీరోల సినిమాలకు బాలీవుడ్ లో కూడా మంచి మార్కెట్ ఏర్పడడంతో పలువురు హీరోలు తమ సినిమాలను పాన్ ఇండియా స్థాయిలో ప్లాన్ చేసుకుంటున్నారు. ఇప్పటికే ప్రభాస్ సినిమాలన్నీ ఆ స్థాయిలోనే నిర్మాణం అవుతున్నాయి. ఆ తర్వాత మహేశ్, ఎన్టీఆర్ సినిమాలు కూడా మెల్లగా పాన్ ఇండియా సినిమాలుగా రూపాంతరం చెందుతున్నాయి.

ఈ కోవలో మెగాస్టార్ వారసుడు రామ్ చరణ్ కూడా ఇకపై తన సినిమాలను పాన్ ఇండియా స్థాయి చిత్రాలుగా నిర్మాణం జరపడానికి సమాయత్తమవుతున్నాడు. 'ఆర్ఆర్ఆర్' తర్వాత తాను చేయబోయే సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఉండాలన్న ఉద్దేశంతో అలాంటి కథ కోసం, దానిని సరిగా డీల్ చేయగల దర్శకుడి కోసం ఆయన చూస్తున్నాడు.

ఈ క్రమంలో తమిళ దర్శకుడు మోహన్ రాజా ఇటీవల చరణ్ ని కలసి ఓ కథ చెప్పాడనీ, అది ఆయనకు నచ్చిందని తెలుస్తోంది. దీంతో ఈ చిత్రాన్ని పాన్ ఇండియా చిత్రంగా నిర్మించే ఉద్దేశంతో ప్రస్తుతం మోహన్ రాజాతో చరణ్ చర్చలు జరుపుతున్నాడట. బహుశా చరణ్ చేసే తదుపరి చిత్రం ఇదే కావచ్చని అంటున్నారు. ఆమధ్య చరణ్ చేసిన 'ధృవ' చిత్రం తమిళ మాతృక అయిన 'తని ఒరువన్'కి దర్శకుడు మోహన్ రాజానే!  

More Telugu News