Shashi Tharoor: విపక్షాల విమర్శలను ఏమాత్రం ఖాతరు చేయడం లేదు: శశిథరూర్

  • దేశం అనేక సమస్యలతో అల్లాడుతోంది
  • ప్రజల దృష్టిని మళ్లించేందుకు కేంద్రం యత్నిస్తోంది
  • సభలో లేని కుటుంబంపై నిందలు వేస్తోంది
Centre trying to divert peoples attention sasy Shashi Tharoor

ప్రస్తుతం దేశం అనేక సమస్యలతో సతమతమవుతోందని కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ అన్నారు. దేశంలో ఎన్నడూ లేనంతగా నిరుద్యోగ లెక్కలు మన కళ్ల ముందు ఉన్నాయని చెప్పారు. ఓవైపు కరోనాతో పోరాడుతున్నామని, మరోవైపు చైనా దురాక్రమణలు కొనసాగుతున్నాయని తెలిపారు. వీటన్నింటిపై పార్లమెంటులో చర్చించాలన్న చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేదని అన్నారు. విపక్షాలు చేస్తున్న విమర్శలను సైతం లెక్క చేయడం లేదని... సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ప్రభుత్వం యత్నిస్తోందని దుయ్యబట్టారు. సభలో లేని ఒక కుటుంబంపై నిందలు వేస్తూ సభా సమయాన్ని వృథా చేస్తోందని మండిపడ్డారు.

ఆర్థక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభలో ప్రవేశపెట్టిన ట్యాక్సేషన్ బిల్లుపై విపక్ష ఎంపీలు లేవనెత్తిన అభ్యంతరాలపై ఆర్థికశాఖ సహాయమంత్రి అనురాగ్ ఠాకూర్ పెదవి విప్పలేదని థరూర్ విమర్శించారు. సభలో ఆయన మాట్లాడిన తీరు ఒక రాజకీయ ప్రసంగంలా ఉందని అన్నారు. ఆయన మట్లాడిన తీరుతో సభ నాలుగు సార్లు వాయిదా పడిందని చెప్పారు.

More Telugu News