టీవీ నటి శ్రావణి ఆత్మహత్య కేసులో కొత్త విషయం.. కీలక సమాచారం రాబట్టిన పోలీసులు!

New twist in Sravani Suicide case
  • ఆడియో, సీసీటీవీ ఫుటేజీలు వెలుగులోకి
  • రెస్టారెంట్‌లో శ్రావణి, దేవరాజ్‌ను చూసి ఆగ్రహంతో ఊగిపోయిన సాయికృష్ణారెడ్డి
  • కుటుంబ సభ్యులతో కలిసి శ్రావణిపై చేయిచేసుకున్న సాయి
సీరియల్ నటి శ్రావణి ఆత్మహత్య కేసులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన దేవరాజ్‌తోపాటు సాయికృష్ణారెడ్డిని కూడా శ్రావణి ప్రేమించినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. తొలుత సాయితో ప్రేమలో పడిన శ్రావణి, ఆ తర్వాత దేవరాజ్ పరిచయం కావడంతో సాయిని దూరం పెట్టినట్టు తెలుస్తోంది. ఈ కారణంగానే సాయి ఆమెపై ద్వేషం పెంచుకున్నాడని పోలీసులు చెబుతున్నారు.

పోలీసుల కథనం ప్రకారం, ఈ నెల 7న దేవరాజ్, శ్రావణి ఎస్సార్‌నగర్‌లోని ఓ రెస్టారెంట్‌కు వెళ్లారు. అక్కడ వీరిద్దరినీ చూసిన సాయి కోపంతో శ్రావణిపై చేయి చేసుకున్నాడు. దీంతో భయపడిన శ్రావణి ఇంటికెళ్లేందుకు ప్రయత్నించగా ఆటోకు అడ్డుపడి వాగ్వివాదానికి దిగాడు. ఇందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ తాజాగా వెలుగులోకి వచ్చింది.

మరోపక్క, శ్రావణి ఇంటికి చేరుకునే లోపే ఆ విషయాన్ని ఆమె కుటుంబ సభ్యులకు చేరవేశాడు. దీంతో రగిలిపోయిన కుటుంబ సభ్యులు, సాయి కలసి శ్రావణిని విపరీతంగా కొట్టారు. తనను కొడుతున్న సమయంలోనే దేవరాజ్‌కు శ్రావణి ఫోన్ చేసింది. అతడు ఆ గొడవను రికార్డు చేశాడు. ఆ తర్వాత కాసేపటికే శ్రావణి బలవన్మరణానికి పాల్పడింది. పోలీసుల విచారణ సందర్భంగా దేవరాజ్ ఈ విషయాలు వెల్లడించినట్టు సమాచారం.

సీసీటీవీ ఫుటేజీతోపాటు కాల్ రికార్డ్స్‌ బయటకు రావడంతో ఇప్పుడు పోలీసుల దర్యాప్తు సాయికృష్ణారెడ్డిపై పడింది. ఓ సినీ నిర్మాతతో సహజీవనం చేయాలంటూ శ్రావణిపై సాయి ఒత్తిడి తెచ్చినట్టు కూడా పోలీసులు గుర్తించారు. నేడు విచారణకు హాజరు కావాల్సిందిగా ఆ నిర్మాతను పోలీసులు ఆదేశించారు. కాగా, శ్రావణి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. అందులో శ్రావణి మాట్లాడుతూ ‘‘దేవరాజ్ నా ఫేవరెట్ హీరో.. నువ్వు నా స్పెషల్. నీలో ఎలాంటి తప్పులేదు’’ అని దేవరాజ్‌కు మద్దతుగా మాట్లాడింది.
Go Back to Shorts
Sravani
TV Actress
SR Nagar
Crime News
Devaraj Reddy
Sai Krishna Reddy

More Telugu News