TikTok: టిక్ టాక్ అమెరికాకు ప్రమాదకరం కావచ్చు: ఫేస్ బుక్ అధినేత జుకర్ బర్గ్

  • టిక్ టాక్ ప్రమాదకరం
  • యూఎస్ సాంకేతికతకు విఘాతం కలగవచ్చు
  • చైనా సంస్థలు ప్రమాదకరం
TikTok may be dangerous to USA says Mark Zuckerberg

చైనా యాప్ లపై పలు దేశాలు వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నాయి. డ్రాగన్ కంట్రీకి సంబంధించిన పలు యాప్ లను భారత్ ఒక్కసారిగా నిషేధించడం ప్రపంచ వ్యాప్తంగా ఒక సెన్సేషన్ ను క్రియేట్ చేసింది. ఆ తర్వాత వివిధ దేశాలు ఇదే అంశంపై నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నాయి. భారత్ నిర్ణయంతో ఆ దేశానికి చెందిన ప్రముఖ వీడియో షేరింగ్ యాప్ టిక్ టాక్ కుదేలైపోయింది. అమెరికా సైతం ఈ యాప్ ను నిషేధించాలని నిర్ణయించింది. యూఎస్ కంపెనీ కింద ఈ సంస్థ ఉంటే సమస్య లేదని ట్రంప్ సర్కార్ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో, అమెరికాలో దీన్ని సొంతం చేసుకునేందుకు మైక్రోసాఫ్ట్ ప్రయత్నాలు ప్రారంభించింది.

ఈ నేపథ్యంలో, ఫేస్ బుక్ సీఈవో మార్క్ జుకర్ బర్గ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా భద్రతకు టిక్ టాక్ ప్రమాదకరం కాగలదన్న ట్రంప్ సర్కార్ ఆరోపణలను ఆయన సమర్థించారు. టిక్ టాక్ వల్ల అమెరికా సాంకేతిక ఆధిపత్యానికి విఘాతం కలగవచ్చని వ్యాఖ్యానించారు.

ఇదే సమయంలో జుకర్ బర్గ్ కీలక వ్యాఖ్యలు చేశారు. చైనాకు చెందిన సోషల్ మీడియా సంస్థలు చాలా ప్రమాదకరమని... వాటి విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. మరోవైపు, టిక్ టాక్ ను నిషేధిస్తామన్న ట్రంప్ సర్కార్ నిర్ణయాన్ని కోర్టులో సవాల్ చేస్తామని టిక్ టాక్ ప్రకటించింది. రాబోయే రోజుల్లో ఏం జరగనుందో వేచి చూడాలి.

More Telugu News