raghurama krishna raju: అందుకే నలంద కిశోర్ చనిపోయి ఉండొచ్చు.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలి: రఘురామకృష్ణరాజు డిమాండ్

  • కిశోర్ మృతి నన్ను ఎంతగానో కలచివేసింది
  • భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు తూట్లు పొడుస్తున్నారు
  • నలంద కిశోర్ కరోనాతో చనిపోయారని తెలుస్తోంది
  • ఇది ముమ్మాటికీ పోలీసులు చేసిన హత్యగానే భావించాలి
raghurama krishnam raju about kishore death

వైసీపీ ప్రభుత్వ తీరుపై ఆ పార్టీ అసంతృప్త ఎంపీ రఘురామకృష్ణరాజు తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అనుచరుడు నలంద కిశోర్‌ మృతి చెందడం కలకలం రేపుతోన్న విషయం తెలిసిందే. ఆయన  సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టారంటూ పోలీసులు అరెస్టు చేసి, వదిలేసిన కొన్ని రోజులకే మృతి చెందారు. దీనిపై రఘురామకృష్ణ రాజు ఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ... కిశోర్ మృతి తనను ఎంతగానో కలచివేసిందని చెప్పారు.

'భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు తూట్లు పొడుస్తున్నారు. నలంద కిశోర్ కరోనాతో చనిపోయారని తెలుస్తోంది. ఇది ముమ్మాటికీ పోలీసులు చేసిన హత్యగానే భావించాలి. కిశోర్ ఆరోగ్యం బాగోలేదని తెలిసినప్పటికీ ఆయనను విశాఖపట్నం నుంచి కర్నూలుకు తీసుకెళ్లారు. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పుతప్పే కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి నేను చేసే విన్నపం ఒకటే.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలి' అని ఆయన డిమాండ్ చేశారు.

'ఆయన చేసిన పోస్టుల్లో ఎవరి పేరూ లేదు.. అయినప్పటికీ అరెస్టు చేశారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనూ ఆయనపై కొందరు పోస్టులు చేశారు. పొలిటికల్ పంచ్‌ అంటూ వైసీపీ సభ్యుడు ఒకరు అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆయనను పోలీసులు తీసుకెళ్తే చాలా గగ్గోలు పెట్టాము' అని రఘురామకృష్ణ రాజు చెప్పారు.

'ఆ సమయంలో సోషల్ మీడియాలో పోస్టులు చేస్తే తప్పేంటని వైసీపీ నేతలు ప్రశ్నించారు. ఇప్పుడు మన ప్రభుత్వం ఉంది. మరి ఇప్పుడు మనం కూడా ఇలాగే చేస్తే ఎలా? ఇంతకు ముందు రంగనాయకమ్మ విషయంలోనూ పోలీసుల తీరు బాగోలేదు. పోలీసుల తీరును సీఎం జగన్‌ నిరసించాలి' అని వ్యాఖ్యానించారు. రోజురోజుకీ ఇటువంటి ఘటనలు ఎక్కువైపోతున్నాయని విమర్శించారు.

More Telugu News