Supreme Court: వికాస్ దూబే వంటి కరుడుగట్టిన నేరస్తుడు బెయిల్ పై బయట తిరిగాడా..!: సుప్రీంకోర్టు విస్మయం

  • ఎన్ కౌంటర్ లో దూబే హతం
  • దూబేపై యూపీలో 60కి పైగా కేసులు
  • ఇది వ్యవస్థ వైఫల్యమేనంటూ సుప్రీం వ్యాఖ్యలు
Supreme Court comments on Vikas Dubey issue

ఉత్తరప్రదేశ్ లో తనను అరెస్ట్ చేయడానికి వచ్చిన పోలీసులను పక్కా ప్లాన్ తో కాల్చి చంపిన వికాస్ దూబే ఆపై ఎన్ కౌంటర్ లో హతుడయ్యాడు. అతడిపై 60కి పైగా కేసులు ఉన్నాయని వెల్లడైంది. అన్ని కేసులున్న వ్యక్తి అంత దర్జాగా బయట ఎలా తిరగ్గలిగాడంటూ సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఎన్నో నేరాలకు పాల్పడ్డ వికాస్ దూబే వంటి క్రిమినల్ కు కూడా బెయిల్ వచ్చిందంటే అది వ్యవస్థ వైఫల్యమేనని, కటకటాల వెనక ఉండాల్సిన వ్యక్తి బయట ఉన్నాడు అంటూ విచారం వ్యక్తం చేసింది.

లెక్కకు మిక్కిలి కేసులున్న వికాస్ దూబే వంటి నేరగాడు బెయిల్ పై స్వేచ్ఛగా తిరిగాడన్న అంశం భీతిగొలుపుతోంది అని చీఫ్ జస్టిస్ ఎస్ఏ బోబ్డే వ్యాఖ్యానించారు. ఉత్తరప్రదేశ్ లో చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని, అది మీ విధి అని అక్కడి రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ఈ మేరకు యూపీ సొలిసిటర్ జనరల్ కు బోబ్డే, ఏఎస్ బోపన్న, వి.రామసుబ్రమణియన్ లతో కూడిన సుప్రీం ధర్మాసనం నిర్దేశించింది. వికాస్ దూబే ఎన్ కౌంటర్ పై దాఖలైన పిటిషన్లను విచారించిన సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది.

More Telugu News