India: కస్టమర్ల సమస్త సమాచారాన్నీ 72 గంటల్లోగా ఇవ్వండి.. అమెజాన్, గూగుల్ కు కేంద్ర ప్రభుత్వం ఆదేశం!

  • కస్టమర్లు, వారి ఫోన్ నంబర్ల వివరాలు ఇవ్వాలి
  • వినియోగదారుల నుంచి వచ్చిన ఫిర్యాదుల గురించి చెప్పాలి
  • ఈ-కామర్స్ పాలసీ ముసాయిదా విడుదల
Indian Governments Warning to E commerce Companies

ఇండియాలో సేవలందిస్తున్న ఈ-కామర్స్ దిగ్గజాలు అమెజాన్, గూగుల్ సహా ఇతర కంపెనీలన్నీ, ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా పనిచేయాల్సిందేనని, వారి వద్ద ఉన్న కస్టమర్ల సమస్త సమాచారాన్నీ, ప్రభుత్వానికి 72 గంటల్లోగా అందించాల్సిందేనని కేంద్ర ప్రభుత్వం తాఖీదులు జారీ చేసింది. జాతీయ భద్రత, పన్ను చెల్లింపులు, లా అండ్ ఆర్డర్ ముడిపడివున్న ఈ అంశంలో వెనక్కు తగ్గేది లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు సరికొత్త ఈ-కామర్స్ పాలసీ ముసాయిదాను విడుదల చేసింది. స్థానిక, అంతర్జాతీయ కంపెనీలు తమ వద్ద ఉన్న డేటాను ఎలా వినియోగిస్తున్నాయో తెలుసుకునే అవసరం కేంద్రానికి ఉందని పేర్కొంది.

కాగా, గత రెండేళ్లుగా ఈ-కామర్స్ పాలసీపై ముసాయిదా తయారీలో వివిధ వర్గాల అభిప్రాయాలను తెలుసుకుంటున్న కేంద్రం, గ్లోబల్ టెక్ దిగ్గజాలు అమెజాన్, ఆల్ఫాబెట్ (గూగుల్ మాతృసంస్థ), ఫేస్ బుక్ తదితరాల ప్రాధాన్యాన్ని తగ్గించాలని నిర్ణయించింది. ఈ మేరకు 15 పేజీల ముసాయిదాను కేంద్రం తయారు చేసింది. ఈ-కామర్స్ రెగ్యులేటర్ ను నియమించడం ద్వారా పరిశ్రమలో పోటీ తత్వాన్ని పెంచి, సమాచార వనరులను సక్రమంగా వినియోగించుకోవాలన్నది ప్రభుత్వ ఉద్దేశంగా తెలుస్తోంది.

కేంద్ర వాణిజ్య శాఖ అధీనంలోని డిపార్ట్ మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్, ఈ ముసాయిదాను తయారు చేసింది. ఆన్ లైన్ కంపెనీల సోర్స్ కోడ్, ఆల్గారిథమ్స్ ను ప్రభుత్వం యాక్సెస్ చేసే అవకాశం ఇవ్వడంతో పాటు, వారు వాడుతున్న కృత్రిమ మేథస్సు వివరాలను కూడా కేంద్రానికి అందించాల్సి వుంటుంది. ఇప్పటికే దేశంలో డిజిటల్ ఎకానమీ ఊపందుకోవడం, దాదాపు 100 కోట్ల మంది ఏదో ఒకవిధంగా డిజిటల్ మాధ్యమాలను వినియోగిస్తుండటంతో, పలు అంతర్జాతీయ కంపెనీలు ఇండియాలో కార్యకలాపాలు సాగిస్తున్న సంగతి తెలిసిందే.

డిజిటల్ పేమెంట్స్ వ్యవస్థ పుంజుకోవడంతో, అంతే మొత్తంలో మోసాలు కూడా పెరిగాయి. ఇదే సమయంలో స్థానిక స్టార్టప్ సంస్థలు, తమకు ప్రభుత్వ సహకారం కావాలని కోరుతున్నాయి. ఇటీవలే చైనా దిగ్గజ సాంకేతిక కంపెనీలకు చెందిన యాప్స్ ను నిషేధించిన నేపథ్యంలో, భారత కంపెనీల యాప్స్ కు మద్దతు పెరిగింది. భారత వినియోగదారుల ప్రయోజనాలను కాపాడేందుకే ఈ ముసాయిదాను తీసుకుని వచ్చామని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

ఈ-కామర్స్ సంస్థలు తమకు వస్తువులను అందించే వారందరి వివరాలను ఫోన్ నంబర్లతో సహా ఇవ్వాలని, కస్టమర్లు ఇప్పటివరకూ చేసిన ఫిర్యాదుల తాలూకు వివరాలు, వారి ఈ-మెయిల్ ఐడీలు, చిరునామాలను కూడా సమర్పించాల్సి వుంటుందని కేంద్రం ఈ ముసాయిదాలో స్పష్టం చేసింది. దిగుమతి చేసుకున్న వస్తు ఉత్పత్తులైతే, ఏ దేశం నుంచి ఎప్పుడు వచ్చాయన్న విషయాన్ని స్పష్టం చేయాలని పేర్కొంది. కేంద్రం తీసుకువచ్చిన ఈ ముసాయిదాపై ఈ-కామర్స్ కంపెనీలు ఇంకా స్పందించలేదు.

More Telugu News