Botsa: టీడీపీ ఎమ్మెల్సీలు పక్కా ప్లాన్ తో వచ్చారు: బొత్స విమర్శలు

  • టీడీపీ ఎమ్మెల్సీలు దౌర్జన్యపూరితంగా వ్యవహరిస్తున్నారన్న బొత్స
  • లోకేశ్ కు ఫొటోలు తీయొద్దని గతంలోనే చెప్పామని వెల్లడి
  • టీడీపీ సభ్యులు ఏం సాధించాలనుకుంటున్నారంటూ ఆగ్రహం
Botsa fires on TDP members

టీడీపీ ఎమ్మెల్సీలు అధికార పక్ష నేతల పట్ల దౌర్జన్యపూరితంగా వ్యవహరిస్తున్నారని, సంఖ్యాబలం చూసుకుని బిల్లులు అడ్డుకుంటున్నారని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. సీఆర్డీయే రద్దు బిల్లు, పాలనా వికేంద్రీకరణ బిల్లులు అడ్డుకునేందుకు పక్కా ప్లాన్ తో వచ్చారని టీడీపీ ఎమ్మెల్సీలపై విమర్శలు చేశారు. బిల్లులపై ఏవైనా అభ్యంతరాలుంటే ఓటింగ్ జరుపుకోవచ్చని హితవు పలికారు.

నారా లోకేశ్ వ్యవహారంపైనా బొత్స స్పందించారు. సభలో జరుగుతున్న వ్యవహారాలను వీడియోలు, ఫొటోలు తీయొద్దని గతంలోనూ నారా లోకేశ్ కు చెప్పామని, కానీ మరోసారి అదే పని చేశారని మండిపడ్డారు. ఇదేమని ప్రశ్నిస్తే మంత్రులపై దాడులకు దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్లే దౌర్జన్యం చేసి, మేం చేశామనడం హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు. టీడీపీ ఎమ్మెల్సీలు ఏం సాధించాలని అనుకుంటున్నారో అర్థం కావడం లేదని అన్నారు. ఈ సమయంలో డిప్యూటీ చైర్మన్ కూడా "మా సభ్యులు" అంటూ మాట్లాడడం సరికాదని బొత్స హితవు పలికారు.

More Telugu News