ASPRTC: మా బస్సులను అనుమతించండి... తెలంగాణ, కర్ణాటక, ఒడిశాలకు ఏపీ వినతి!

  • లేఖ రాసిన నీలం సాహ్ని
  • ఇప్పటికే బస్సులను నడపాలంటున్న కలెక్టర్లు
  • ఇంకా నిర్ణయం తీసుకోని తెలంగాణ
Andhra Asked 3 States to Allow APSRTC Buses

తమ రాష్ట్ర బస్సులను అనుమతించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున సీఎస్ నీలం సాహ్ని, ఒడిశా, కర్ణాటక, తెలంగాణ ప్రభుత్వాలకు నిన్న లేఖను రాశారు. 8వ తేదీ నుంచి అంతర్రాష్ట్ర సర్వీసులను నడిపించాలని భావిస్తున్న ప్రభుత్వం, ఇదే విషయాన్ని మూడు రాష్ట్రాల ప్రభుత్వాలకూ తెలియజేసింది. తమిళనాడులో మాత్రం కేసుల సంఖ్య అధికంగా ఉండటంతో, ఆ రాష్ట్రం ఇతర రాష్ట్రాల వారిని అనుమతించేది లేదని స్పష్టం చేయడంతో తమిళనాడుకు మాత్రం ఆమె లేఖను పంపలేదని తెలుస్తోంది.

కాగా, ప్రైవేటు వాహనాలు, రైళ్లలో భారీ ఎత్తున ప్రజలు వస్తుండటంతో, వారందరి వివరాలు సేకరించడం కష్టంగా ఉందని ఇటీవల ఏపీ జిల్లాల కలెక్టర్లు ప్రభుత్వం వద్ద వాపోయిన సంగతి తెలిసిందే. వెంటనే బస్సులను అనుమతించాలని వారు రవాణా శాఖను కోరారు. ఇక తెలంగాణ రాష్ట్రం అంతర్రాష్ట్ర ప్రయాణికులను అనుమతిస్తున్నప్పటికీ, బస్సుల విషయంలో మాత్రం ఇంకా ఎటువంటి నిర్ణయమూ తీసుకోలేదు. ఈ విషయంలో స్పష్టమైన విధానాన్ని తెలంగాణ ప్రకటించాలని ఏపీ కోరుతోంది. ఈ విషయంలో మరో రెండు రోజుల్లో నిర్ణయం వెలువడవచ్చని, సోమవారం నుంచి బస్సులు తిరిగి ప్రారంభం అవుతాయని సమాచారం.

More Telugu News