Jagan: రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుంది: ఏపీ సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

  • హోదా వస్తే ప్రోత్సాహకాలు మెండుగా ఉండేవి
  • గత టీడీపీ ప్రభుత్వం హోదాను తీసుకురాలేకపోయింది
  • బీజేపీకి మెజార్టీ రాకపోతే హోదా డిమాండ్ చేసేవాళ్లం
  • భవిష్యత్‌లో మాత్రం ఇతర పార్టీలపై  ఆధారపడే పరిస్థితి వస్తుంది
jagan about special status

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధిస్తామని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. హోదా వస్తే ప్రోత్సాహకాలు మెండుగా ఉండేవని, ఇవాళ కాకపోతే రేపయినా వస్తుందని ఆయన స్పష్టం చేశారు. మౌలిక సదుపాయాల్లో రాష్ట్రం మెరుగ్గా ఉందని, రాష్ట్రంపై కేంద్రం ఆధారపడే రోజులు వస్తాయని ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చి ఏడాది నిండిన నేపథ్యంలో నాలుగోరోజు వైసీపీ మేధోమథనం సదస్సులో ‘మన పాలన-మీ సూచన’ అంశంపై జగన్ మాట్లాడారు.

ఏపీకి ప్రత్యేక హోదా వస్తే ఎన్నో కంపెనీలు వచ్చేవని, గత టీడీపీ ప్రభుత్వం హోదాను తీసుకురాలేకపోయిందని జగన్ విమర్శించారు. మరోవైపు, గత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ పూర్తి మెజార్టీతో కేంద్రంలో అధికారంలోకి వచ్చిందని, లేదంటే ఆ పార్టీకి మద్దతిచ్చే క్రమంలో ప్రత్యేక హోదా డిమాండ్‌ చేసేవాళ్లమని చెప్పారు.

అయితే, భవిష్యత్‌లో మాత్రం కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే బీజేపీ ఇతర పార్టీలపై ఆధారపడే పరిస్థితి వస్తుందని, తాము అప్పుడు  హోదా డిమాండ్ చేస్తామన్నారు. గత టీడీపీ ప్రభుత్వం గ్రాఫిక్స్‌ చూపించి ప్రజలను మోసం చేసిందని, ఈజ్‌ ఆఫ్ డూయింగ్‌ బిజినెస్‌లో తొలి ర్యాంక్‌ అంటూ గొప్పగా చెప్పుకుందని తెలిపారు.

పారిశ్రామిక రంగానికి భూములు ఇచ్చేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని జగన్ తెలిపారు. రాష్ట్రంలో ప్రాథమిక స్థాయి నుంచి ఆంగ్ల మాధ్యమ విద్య కోసం ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో ఎక్కడా విద్యుత్ కొరతలేదన్నారు. 

More Telugu News