USA: రానున్న రెండు వారాలూ అమెరికన్లకు అత్యంత బాధాకరం.. 2.40 లక్షల మంది వరకూ చనిపోవచ్చని వైట్ హౌస్ అంచనా!

  • సుమారు 2.40 లక్షల మంది మరణించవచ్చు
  • కష్టకాలాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి
  • అమెరికన్లకు డొనాల్డ్ ట్రంప్ పిలుపు
Trump Called Next Two Weeks Very Painful

రానున్న రెండు వారాల సమయం అమెరికన్లకు అత్యంత బాధాకరమైన రోజులను కళ్లముందుంచనున్నాయని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. సుమారు 2.40 లక్షల మంది వరకూ  అమెరికన్లు చనిపోవచ్చని వైట్ హౌస్ టాస్క్ ఫోర్స్ అంచనా వేసింది. ఈ నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యానిస్తూ, "ఇది చాలా బాధను కలిగించనుంది. చాలా చాలా బాధ కలిగించే సంఘటనలు రెండు వారాల్లో కలుగుతాయి" అని వైట్ హౌస్ లో జరిగిన మీడియా సమావేశంలో  వ్యాఖ్యానించారు.

కరోనా మహమ్మారి ప్లేగు వ్యాధిని గుర్తు చేస్తున్నదని అభివర్ణించిన ట్రంప్, "ముందు ముందు రానున్న కష్టకాలాన్ని ఎదుర్కొనేందుకు ప్రతి అమెరికన్ సిద్ధంగా ఉండాలి" అని సూచించారు.

కాగా, అమెరికాలోని టాప్ హెల్త్ ఎక్స్ పర్ట్స్ మాత్రం, ప్రజలు భౌతిక దూరాన్ని పాటించడం ఒక్కటే, కరోనా వైరస్ ను ఎదుర్కొనే మార్గమని, వైరస్ సోకకుండా ఉండాలంటే, ఎవరూ గుమికూడరాదని సలహా ఇస్తున్నారు. ఇప్పటికే అమెరికా ఆర్థిక వ్యవస్థను వైరస్ కుదేలు చేసింది. "కరోనాను శరీరం నుంచి తొలిగించేందుకు ఏ మ్యాజిక్ వాక్సిన్ లేదా వైద్యం లేదు. కేవలం అలవాట్లను మార్చుకోవడం ద్వారా వైరస్ కు దూరం కావచ్చు" అని వైట్ హౌస్ కరోనా వైరస్ రెస్పాన్సివ్ టీమ్ సమన్వయకర్త డెబోరాహ్ బిర్క్స్ వ్యాఖ్యానించారు.

అమెరికాలో కరోనా మరణాలు ఎలా ఉంటాయన్న అంచనాను తెలిపే ఓ చార్టును ప్రదర్శించిన ఆయన, యూఎస్ లో లక్ష నుంచి 2.40 లక్షల వరకూ మరణాలు సంభవించవచ్చని అన్నారు.

More Telugu News