Akbar Ali: తీవ్ర విషాదంలోనూ జట్టును గెలిపించే ఇన్నింగ్స్ ఆడిన బంగ్లాదేశ్ కెప్టెన్

  • ఫైనల్లో 43 పరుగులు చేసిన బంగ్లా కెప్టెన్ అక్బర్ అలీ
  • వరల్డ్ కప్ విజయంలో ఆ పరుగులే కీలకంగా మారిన వైనం
  • టోర్నీలో ఆడుతున్న సమయంలో అక్బర్ అలీ సోదరి మృతి
  • కవలలకు జన్మనిస్తూ కన్నుమూసిన వైనం 
 Bangladesh captain fought for worldcup in pain as her sister died

బంగ్లాదేశ్ క్రికెట్ చరిత్రలో మరపురాని విజయంగా నిన్న జరిగిన అండర్-19 వరల్డ్ కప్ టైటిల్ పోరు నిలిచిపోతుంది. ఓటమి అంచున నిలిచిన జట్టును బంగ్లాదేశ్ కెప్టెన్ అక్బర్ అలీ మొండిపట్టుదలతో ఆడి విజయం దిశగా నడిపించాడు. లక్ష్యఛేదనలో అక్బర్ అలీ చేసిన 43 పరుగులే ఆ జట్టుకు తొలి ఐసీసీ టైటిల్ ను సాధించిపెట్టాయి. అయితే, ఇంత గొప్ప ఇన్నింగ్స్ ఆడిన అక్బర్ అలీ పరిస్థితి తెలిస్తే ఎవరైనా "అయ్యో పాపం!" అనకమానరు. ఎందుకంటే, ఈ టోర్నీ జరుగుతుండగానే అతడి సోదరి ఖదీజా ఖాతూన్ చనిపోయింది. కవల పిల్లలకు జన్మనిచ్చే క్రమంలో ఆమె కన్నుమూసింది.

జింబాబ్వేతో బంగ్లాదేశ్ మ్యాచ్ ను కూడా చూసిన ఆమె, ఆ తర్వాత ప్రసవం సందర్భంగా ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయింది. అయితే సోదరి చనిపోయిన విషయం అక్బర్ అలీకి వెంటనే తెలియలేదు. కుటుంబ సభ్యులు కూడా చెప్పలేదు. ఇతరుల ద్వారా ఆ సమాచారం తెలుసుకున్న అక్బర్ అలీ దిగ్భ్రాంతికి గురయ్యాడు. తనకు ఎందుకు చెప్పలేదంటూ సోదరుడిపై ఆగ్రహం వ్యక్తం చేశాడట. ఏదేమైనా, తీరని విషాదం నడుమ గొప్ప ఇన్నింగ్స్ ఆడి తన జట్టుకు చరిత్రలో మర్చిపోలేని విజయం అందించాడు.

More Telugu News