Jana Sena: ఇంటర్ ఫలితాల అవకతవకలపై నిరసన.. జనసేన కార్యకర్తలపై లాఠీచార్జ్!
ఈ ఉదయం ఇంటర్మీడియట్ బోర్డు ముట్టడికి జనసేన కార్యకర్తలు వచ్చిన వేళ పోలీసులు లాఠీచార్జ్ చేసి వారిని చెదరగొట్టడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. జనసేన తెలంగాణ ఇన్ చార్జ్ శంకర్ గౌడ్ ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు భారీ ఎత్తున తరలివచ్చారు. పోలీసులు వారిని అడ్డుకున్న వేళ వాగ్వాదం జరిగింది. కార్యకర్తలను తరలించే ప్రక్రియలో భాగంగా పోలీసులు తమ లాఠీలకు పనిచెప్పాల్సి వచ్చింది. కాగా, తమపై లాఠీ చార్జ్ చేయడాన్ని శంకర్ గౌడ్ తీవ్రంగా ఖండించారు. పోలీసులను చూసి తాము వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని, ఇంటర్ విద్యార్థులకు న్యాయం జరిగేంత వరకూ తాము పోరాడతామని స్పష్టం చేశారు.