Rajya Sabha: టీడీపీ మద్దతుతో రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా హరిప్రసాద్!

  • కర్ణాటకకు చెందిన ఎంపీని బరిలోకి దింపిన కాంగ్రెస్
  • సీపీఐ, టీడీపీ, తృణమూల్ తదితర పార్టీల మద్దతు
  • హరిప్రసాద్ విజయం ఖాయమన్న ఆనంద్ శర్మ
రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికలో తమ అభ్యర్థిగా కర్ణాటకకు చెందిన ఎంపీ బీకే హరిప్రసాద్ ను నిలపాలని కాంగ్రెస్ నిర్ణయించింది. డిప్యూటీ చైర్మన్ పదవికి 9వ తేదీన ఎన్నికలు జరిపించేందుకు షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలుగుదేశం, సీపీఐ తదితర పార్టీల మద్దతుతో విపక్షాల తరఫున ఉమ్మడి అభ్యర్థిగా హరిప్రసాద్ పేరును తెరపైకి తెచ్చారు. సీపీఐ నేత డీ రాజా స్వయంగా హరిప్రసాద్ పేరును ప్రకటించారు. ఇక, కాంగ్రెస్ కు ఆమ్ ఆద్మీ, తృణమూల్ కాంగ్రెస్, తెలుగుదేశం తదితర పార్టీల మద్దతు ఖాయంగా కనిపిస్తోంది.

తమకు మద్దతివ్వాలని ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ కు కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ కోరారు. అయితే, ఆజాద్ కోరికను సున్నితంగా ఆయన తిరస్కరించినట్టు తెలుస్తోంది. తాము జేడీయూకు చెందిన హరివంశ్ నారాయణ్ కు మద్దతిస్తామని హామీ ఇచ్చామని ఆయన చెప్పినట్టు తెలుస్తోంది. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికల్లో హరిప్రసాద్ విజయం సాధిస్తారని కాంగ్రెస్ నేత ఆనంద్ శర్మ వ్యాఖ్యానించారు. తాము చాలా మంది పేర్లను పరిశీలించి హరిప్రసాద్ పేరును ఎంపిక చేశామని ఆయన తెలిపారు.
Rajya Sabha
Deputy Chairman
Hariprasad
Karnataka
Congress
Telugudesam

More Telugu News