'నా పేరు సూర్య' చిత్రంపై కుట్రలు: అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

  • నాలుగు రోజుల్లో విడుదల కానున్న 'నా పేరు సూర్య'
  • సినిమాను ఫ్లాప్ చేసేందుకు కుట్రలు
  • కుట్రలను మెగా అభిమానులు దాటుతారన్న అల్లు అరవింద్
మరో నాలుగు రోజుల్లో విడుదల కానున్న అల్లు అర్జున్ కొత్త చిత్రం 'నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా' ప్రీ రిలీజ్ వేడుక నిన్న జరుగగా, కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, సినిమాపై కుట్ర జరుగుతోందని సంచలన కామెంట్స్ చేశారు. ఇటీవలి కాలంలో తెలుగు చిత్ర పరిశ్రమలో మనసుకు బాధ కలిగించే ఘటనలు కొన్ని జరిగాయని గుర్తు చేసిన ఆయన, ఆ విషయాలపై తాము కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందని అన్నారు.

ఈ నిర్ణయాలు కొందరికి నష్టం కలిగించాయని, ఆ కారణంతో సినిమా ఫ్లాప్ అంటూ ప్రచారం చేయనున్నారని, మిక్స్ డ్ టాక్ తీసుకురావడానికి, విమర్శలు గుప్పించడానికి ప్రయత్నిస్తారని అన్నారు. వారి కుట్రలను మెగా అభిమానులు దాటుతారన్న నమ్మకం తనకుందని వ్యాఖ్యానించారు. సినిమా బాగుంటే ప్రతి ఒక్కరూ హర్షిస్తారని చెప్పిన ఆయన, ఈ గొడవల్లో కనెక్ట్ కావద్దని బన్నీకి సూచించారు. ఈ సినిమా తప్పకుండా సూపర్ హిట్ అవుతుందని, ఇంతకన్నా ఇప్పుడేమీ మాట్లాడలేనని, సక్సెస్ మీట్ లో మాట్లాడతానని గర్వంగా చెప్పగలనని అల్లు అరవింద్ వ్యాఖ్యానించారు.
Go Back to Shorts
Allu Arjun
Allu Aravind
Naa peru Surya

More Telugu News