ప్రతిభా కేంద్రాలుగా ఏపీ రెసిడెన్షియల్ స్కూళ్లు.. ఏఐ స్కిల్స్ తప్పనిసరి: నారా లోకేశ్ ఆదేశాలు

ప్రతిభా కేంద్రాలుగా ఏపీ రెసిడెన్షియల్ స్కూళ్లు.. ఏఐ స్కిల్స్ తప్పనిసరి: నారా లోకేశ్ ఆదేశాలు

Nara Lokesh orders AI skills mandatory for AP Residential Schools as talent hubs
  • నిమ్మకూరులో ఐఐటీ-జేఈఈ/నీట్ అకాడమీ ఏర్పాటుకు ఆమోదం
  • 10 రెసిడెన్షియల్ స్కూళ్లను సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లుగా అభివృద్ధి చేయాలని నిర్ణయం
  • విద్యార్థులకు ఏఐ స్కిల్స్‌తో పాటు కంప్యూటర్ ల్యాబ్స్ తప్పనిసరి
  • సిబ్బంది పదవీ విరమణ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఏపీ రెసిడెన్షియల్ పాఠశాలలను (ఏపీఆర్ఎస్) ప్రతిభావంతులను తయారుచేసే అత్యుత్తమ కేంద్రాలుగా తీర్చిదిద్దాలని, మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా అంతర్జాతీయ ప్రమాణాలను నెలకొల్పాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఉండవల్లిలోని తన నివాసంలో శుక్రవారం ఆయన అధ్యక్షతన ఏపీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీ (APREIS) 59వ గవర్నింగ్ బాడీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రెసిడెన్షియల్ విద్యావ్యవస్థను సమూలంగా బలోపేతం చేసే దిశగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

ఈ సమావేశంలో మంత్రి లోకేశ్ మాట్లాడుతూ, "ఏపీ రెసిడెన్షియల్ స్కూళ్లు అకడమిక్ ఎక్సలెన్స్‌పై దృష్టి సారించి, ప్రతిభావంతులను తయారు చేసే కేంద్రాలుగా మారాలి" అని ఆకాంక్షించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను తొలిసారిగా పత్రికా ప్రకటనల ద్వారా అభినందించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఇప్పటివరకు రెసిడెన్షియల్ స్కూళ్లలో చదివిన వారిలో 27 మంది ఐఏఎస్‌లు, 20 మంది ఐపీఎస్‌లు, 13 మంది ఐఆర్‌ఎస్‌లు, నలుగురు ఐఎఫ్‌ఎస్‌లతో పాటు ఎందరో ఉన్నత స్థానాల్లో స్థిరపడ్డారని అధికారులు వివరించగా, మంత్రి లోకేశ్ హర్షం వ్యక్తం చేశారు.

కీలక నిర్ణయాలు ఇవే..

టెక్నాలజీలో వస్తున్న మార్పులను దృష్టిలో ఉంచుకుని రెసిడెన్షియల్ పాఠశాలల విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)లో నైపుణ్య శిక్షణను తప్పనిసరి చేయాలని, అన్ని స్కూళ్లలో అత్యాధునిక కంప్యూటర్ ల్యాబ్‌లు ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు. 

రాష్ట్రవ్యాప్తంగా 10 ఏపీఆర్ విద్యాసంస్థలను 'సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌'లుగా అభివృద్ధి చేసే ప్రతిపాదనకు బోర్డు ఆమోదం తెలిపింది. ఇప్పటికే తాడికొండ, కొడిగినహళ్లి పాఠశాలలు ఈ జాబితాలో ఉన్నాయి. 

కృష్ణా జిల్లా నిమ్మకూరులోని ఏపీఆర్ జూనియర్ కళాశాలలో వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఐఐటీ-జేఈఈ/నీట్ అకాడమీని ఏర్పాటు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరో 6 రెసిడెన్షియల్ స్కూళ్లను జూనియర్ కళాశాలలుగా అప్‌గ్రేడ్ చేసేందుకు కూడా సమావేశం ఆమోదముద్ర వేసింది.

సిబ్బంది సంక్షేమం, మౌలిక వసతులపై దృష్టి

సిబ్బంది సంక్షేమానికి సంబంధించి కూడా పలు ముఖ్య నిర్ణయాలు తీసుకున్నారు. ఏపీ రెసిడెన్షియల్ విద్యాసంస్థల సిబ్బంది పదవీ విరమణ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచే ప్రతిపాదనకు బోర్డు ఆమోదం తెలిపింది. గెస్ట్ ఫ్యాకల్టీ గౌరవ వేతనాలను ఇతర సొసైటీలతో సమానంగా పెంచడంతో పాటు, పీఈటీలను పీడీలుగా అప్‌గ్రేడ్ చేసేందుకు అంగీకరించింది. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయ, బోధనేతర సిబ్బంది నియామకాలకు స్టాఫింగ్ ప్యాట్రన్‌కు ఆమోదం తెలిపారు.

అన్ని రెసిడెన్షియల్ స్కూళ్లలో శాశ్వత భవనాలు, మెరుగైన మౌలిక వసతులు కల్పించాలని, ఆటోమేటెడ్ స్మార్ట్ కిచెన్‌ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మంత్రి సూచించారు. విద్యార్థుల వైద్య అత్యవసర పరిస్థితుల కోసం లక్ష రూపాయల వరకు ఖర్చు చేసే అధికారాన్ని సొసైటీ సెక్రటరీకి కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. జగ్గంపేట నియోజకవర్గంలోని భూపతిపాలెం రెసిడెన్షియల్ స్కూల్‌ను ప్రపంచస్థాయి క్రీడా హబ్‌గా తీర్చిదిద్దే అవకాశాలను పరిశీలించాలని లోకేశ్ ఆదేశించారు.

ఈ సమావేశంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి జే. శ్యామలరావు, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కమిషనర్ రంజిత్ బాషా, ఉన్నత విద్యాశాఖ డైరెక్టర్ నారాయణ భరత్ గుప్తా, ఏపీఆర్ఈఐఎస్ కార్యదర్శి కృష్ణమోహన్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Advertisement
Nara Lokesh
AP Residential Schools
Artificial Intelligence Training
APREIS Meeting
Andhra Pradesh Education Reforms
Centers of Excellence

More Telugu News